iDreamPost
android-app
ios-app

సీఎంను చంపుతానన్న వ్యక్తికి బెయిల్

సీఎంను చంపుతానన్న వ్యక్తికి బెయిల్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని మానవబాంబుగా మారి చంపేస్తానని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టి తీసేసిన జనసేన సానుభూతి పరుడు ఫణిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రికి చెందిన పవన్ ఫణి హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. జనసేనపై అభిమానంతో టీడీపీ, వైసీపీలకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూ ఉంటారు. అయితే ఫణి ఇటీవల కన్నా భాయ్ అనే అకౌంట్ తో మానవబాంబుగా మారి సీఎం జగన్‌ను చంపేస్తానని పోస్టు పెట్టి కలకలం రేపాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలియడంతో ఫణి ఆ ట్వీట్ డిలీట్ చేశాడు.

ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారేమోనన్న భయంతో ఉద్యోగానికి సెలవు పెట్టి ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశారు. అయితే సైబర్ క్రైం పోలీసులు మాత్రం పట్టుకుని రాజద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. శుక్రవారం అరెస్ట్ చేసిన ఫణిని శనివారం కోర్టులో హాజరు పరచగా కోర్టు బెయిల్ ఇచ్చింది. రిమాండ్ రిపోర్టును గుంటూరులోని ఆరో అదనపు కోర్టు ఇన్ఛార్జి జడ్జి సయ్యద్ జియావుద్దీన్ తిరస్కరించారు. నిందితుడి పై మోపిన 121, 124ఏ రాజద్రోహంతో పాటు పలు తీవ్ర మైన సెక్షన్లను పెట్టారని, అవి ఈ కేసుకు వర్తించవని జడ్జి పేర్కొన్నారు. రిపోర్టును పరిశీలించిన జడ్జి అతనిపై నమోదు చేసిన వివిధ నేరాలు సరిగాలేవని, మరికొన్ని 7ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్నాయని చెబుతూ నిందితుడికి నోటీసులిచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఫణితో తమ పార్టీకి సంబంధం లేదని జనసేన ప్రకటించింది. సోషల‌్ మీడియాలో ఇలా ఎవరిని ఉద్దేశించి దుష్ప్రచారం చేసేవారిని అయినా ప్రోత్సహించమని జనసేన మీడియా విభాగం తెలిపింది. సీఎంను చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి, తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది. పార్టీ అభిమాని ముసుగులో పోస్టులు చేసేవారిపై అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించింది. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలని.. వాస్తవ, విశ్లేషణాత్మక, చైతన్యపరిచేలా పోస్టులు చేయాలని సూచించింది.