iDreamPost
android-app
ios-app

అన్నీ నేనే.. అంతా నేనే – ఇల్యూజన్ ట్రూత్ ఎఫెక్ట్

  • Published Jan 02, 2020 | 1:37 PM Updated Updated Jan 02, 2020 | 1:37 PM
అన్నీ నేనే..  అంతా నేనే – ఇల్యూజన్ ట్రూత్ ఎఫెక్ట్

అవాస్తవాన్ని ప్రజల చేత నమ్మించాలి అంటే, ఒకటికి పదిసార్లు చెబితే చాలని అంటారు. ఒక అబద్దం 10 సార్లు మన చెవిలో పడితే నిజమేమో అనే నమ్మకం ఏర్పడుతుంది. చిన్నతనంలో పిన్నీసుని భూమిలో పాతిపెడితే బంగారం అవుతుందని పాతిపెట్టి ప్రయత్నించి చూస్తాం. ముక్కు మీద వేలితో 101 సార్లు రుద్దితే హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడని రుద్ది చూస్తాం. నిజానికి పిన్నీసు బంగారం అవ్వదు, హనుమంతుడు కనిపించడు. ఇలా మనం చేయటానికి కారణం ఇది నిజం అని అనేక సార్లు మన చెవిలో పడటంతో ప్రయత్నించి చూడటంలో తప్పేముంది అని ప్రయత్నిస్తాం. ఇలా ఒకటికి 10 సార్లు ఒక అబద్దాన్ని చెప్పి అదే నిజం అని నమ్మించడాన్నే ఇల్యూజన్ ట్రూత్ ఎఫెక్ట్ అంటారు. ఈ సిద్దాంతాన్ని ప్రపంచంలో అత్యధికంగా వాడిన వ్యక్తి గోబెల్స్.. అందుకే ఈ సిద్దాంతాన్ని గోబెల్స్ సిద్దాంతం అని కూడా అంటారు.

ఇక మన కాలంలో ఈ సిద్దాంతాన్ని నమ్ముకుని ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యక్తుల్లో మొదటి వరసలో ఉండే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టా, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసా, కేంద్రంలో చక్రం తిప్పా, దేవగౌడని ప్రధానిని చేసా, మైకొసాఫ్ట్ సి.యి.ఒ సత్యనాదెళ్లకి నేనే స్పూర్తి, పి.వి సింధుకి స్పూర్తిని ఇచ్చా, అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించా, ప్రపంచంలో మొట్టమొదట ఐ.టి ని నేనే ప్రమోట్ చేసా, సెల్ ఫొన్లు నేనే తెచ్చా అంటూ పదే పదే చెప్తూ ఉంటారు. అసత్యాలు, అర్ధసత్యాలతో కూడిన ఇలాంటి మాటలని పదే పదే చెప్పటం ద్వారా అవే సత్యాలుగా మారి, ప్రజలు నిజం అని నమ్మి తనని ఒక గొప్ప పాలన దక్షత కలిగిన నాయకుడని ప్రజలు అనుకుని తనని అధికారం పీఠం మీద కూర్చోపెట్టాలనే కోరికతో చంద్రబాబు నమ్ముకున్న సిద్దాంతం ఇది.

చంద్రబాబు నమ్ముకున్న ఈ సిద్దాంతం కొన్ని రోజులు సత్ఫలితాలు ఇచ్చిన, కొన్నిసార్లు బూమరాంగ్ అయ్యాయి. దీనికి ఉదాహరణ 2004 ఎన్నికలు, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టా, ప్రపంచంలో మొట్టమొదట ఐ.టి ని నేనే ప్రమోట్ చేసా అని చంద్రబాబు ఎంత బాజా వాయించినా, నిజాలని ప్రజలు గ్రహించటం మొదలుపెట్టారు కాబట్టి 2004 ఎన్నికల్లో ఆ ఐటికి హబ్ అయిన హైదరాబాద్ జిల్లాలో ఒకే ఒక్క స్థానంకే పరిమితం అయ్యారు. అప్పట్లో దీనిమీద ఆయన ఒక ఇంటర్వ్యూలో కన్నీరు కూడా కార్చారు. అయినా చంద్రబాబు లో మార్పు కనపడలేదు పదే పదే అంతా నావల్లే , అన్ని నేను చేసినవే అని చెప్పుకుంటూనే ఉన్నారు. ఈ ప్రచారానికి ఆయన ఇది అసెంబ్లీయా లేక పబ్లిక్ మీటింగా అని చూడరు. అవకాశం దొరికినప్పడల్లా ప్రచారానికి తెర లేపుతారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న పరిపాలనా వికేంద్రికరణ నిర్ణయంతో రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు నష్టపొతారు అని చెబుతూ సతీ సమేతంగా ధర్నాకు దిగారు. ఆ సభలో ఆయన నేను కట్టిన సచివాలయంలో జగన్ కూర్చున్నడు, నేను కట్టిన అసెంబ్లీలో జగన్ కూర్చున్నాడు, జగన్ కూర్చున్న కుర్చీ నాది, జగన్ ఉన్న గది నాది అని మాట్లాడి మరోసారి తన సిద్దాంతానికి తెర తీసారు.

నిజానికి ప్రజలు 2014 లో చంద్రబాబు గెల్పించటానికి ముఖ్య కారణం విభజన తరువాత రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే అనుభవజ్ఞుడయిన చంద్రబాబు మేలని ప్రజలు భావించటమే. కానీ గడచిన 5 ఏళ్లలో చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక్క శాశ్వత కట్టడం పూర్తిచేసిన పాపాన పోలేదు. నిర్మాణం చేపట్టిన ప్రతి కట్టడానికి తాత్కాలికమే అనే తోక తగిలించారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ తాత్కాలికమే అయినా వాటిని నిర్మాణానికి అయిన ఖర్చు మాత్రం వందల కోట్లు. తాత్కాలిక పేరుమీద చేసిన ఖర్చు అస్మదీయుల జేబులోకి వెళ్ళిపోయిందని బహిరంగంగా కనపడుతూనే వుంది. ఇన్ని అవకతవకలకు పాల్పడుతూ తాత్కాలికం పేరున ప్రజాధనాన్ని వృధా చేసి, ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తే జగన్ కి వచ్చిన కుర్చీ నాదే, ప్రజలు నిర్ణయిస్తే జగన్ కి వచ్చిన గది నాదే అనడం, వాటిని నేనే కట్టా అని ప్రచారం చేసుకోవటం చూస్తే ప్రజాస్వామ్యాన్నే హేళన చెసే విధంగా ఉంది. అమరావతిలో నిర్మించిన ఆ తాత్కాలిక భవనాలు కూడా ప్రజల డబ్బుతో కట్టినవే కాని చంద్రబాబు సొంత డబ్బులు కాదు. ప్రజల నెత్తిన 700 కోట్ల వడ్డీ పడే విధంగా తెచ్చిన అప్పుతో కట్టిన ఆ తాత్కాలిక భవనాలని కూడా నేనే కట్టా అనటం, ప్రజల మద్దతుతో గెలిచిన ముఖ్యమంత్రి కుర్చీ నాది అనడం చంద్రబాబు దిగజారుడు రాజకీయ విన్యాసాలకు పరాకాష్టగా చెప్పవచ్చు.

నాడు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టా అని ఎంత ప్రచారం చేసుకున్నా చివరికి 2004లో అదే హైదరాబాద్ జిల్లాలో ఒకే ఒక్క సీటు గెలిచారు. నేడు అమరావతిని ప్రపంచ రాజధాని అని ఎంత ప్రమోట్ చేసుకున్నా రాజధాని పరిధిలో ఒక్క స్థానం కూడా గెలవలేక పోయారు. చివరికి మంత్రి హొదా లో బరిలో దిగిన కొడుకు లోకేష్ కూడా ఓటమి పాలయ్యారు. గోబెల్స్ ప్రచారానికి వాస్తవానికి మధ్య ఉన్న తేడాని ప్రజలు గ్రహించటం మొదలుపెట్టారని చెప్పటానికి ఈ రెండు ఉదంతాలు సజీవ సాక్ష్యాలు. ఇప్పటినుండైనా చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రచారాలకు దూరంగా ఉంటే తన హుందాతనాన్ని కాపాడుకున్నవాళ్ళు అవుతారు.