Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రజోపయోగ నిర్ణయాలకు ఆమోద ముద్ర, కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం పరిపాటిగా మారింది. దీంతో రంగాల వారీగా జగన్ సమీక్షలు జరుపుతున్నా.. మంత్రివర్గ సమావేశం అయినా ఏపీ ప్రజలే కాదు.. ఇతర రాష్ట్రాల ప్రజలు, కేంద్ర పెద్దలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.
అంబులెన్స్ సేవలు, టీటీడీ పై కాగ్ పరిశీలన కు అనుమతి, ఆన్ లైన్ జూదం అరికడుతూ నిర్ణయం తదితర అంశాలను అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం లోని కొందరు పెద్దలు ప్రకటనలు కూడా జారీ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు చేశారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. అలాగే వైద్యాన్ని కూడా సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ఒకేసారి 1088 అంబులెన్స్ లను ప్రారంభించి చరిత్ర సృష్టించారు. విమర్శకులు సైతం ప్రశంసించేలా మన్ననలు పొందారు. మద్య నియంత్రణ, బెల్టు షాపుల రద్దు, ఇసుక అక్రమ రవాణా కట్టడి, తాజాగా రైతులకు ఉచిత విద్యుత్ – నగదు బదిలీ వంటి పథకాలు చర్చనీయాంశంగా మారాయి. పథకాల ప్రకటనే కాదు.. వాటి అమలులోనూ వినూత్న పంథా అవలంబిస్తున్నారు జగన్. విద్యుత్ బిల్లుల నగదును నేరుగా రైతుల ఖాతాలోనే వేసి వారితోనే బిల్లు కట్టిస్తూ విద్యుత్ శాఖ రైతుకు జవాబుదారీగా ఉండేలా చేశారు.
ఇదో ఉదాహరణ..
సమాజంలో చెడు ధోరణులకు, ఆర్థిక పతనానికి కారణం అవుతున్న ఆన్లైన్ జూద క్రీడలైన రమ్మీ, పోకర్ వంటి వాటిపై బెట్టింగులను నిషేధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974 సవరణలకు ఆమోదం తెలిపారు. ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్లకు 6 నెలలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, రెండోసారి తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించే విధంగా ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద ఆటలను నిషేంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర క్యాబినెట్కు అభినందనలు తెలిపారు.
అనేక కుటుంబాలు, పిల్లలు ఈ వ్యసనానికి బానిసై ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వం చట్టం చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడల నిషేధంతో యువతకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా ఏపీ సీఎం జగన్ తన వినూత్న నిర్ణయాలతో అందరి ప్రశంసలూ పొందుతున్నారు. టీటీడీపై కాగ్ అడిట్ కు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా కూడా సంచలనమైంది.