Idream media
Idream media
ఈ నెలాఖరుతో ముగిసిపోతున్న 14వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు పెట్టేందుకు మరో ఏడాది గడువు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలకు 2,200 కోట్ల రూపాయల నిధులు రాబోయే ఏడాది కాలంలో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం కొత్తగా ఎన్నికైన పంచాయితీ పాలక మండళ్లకు దక్కింది .
ఈ విషయంలో ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ కి గొప్ప ఊరట లభించిందని చెప్పొచ్చు . గత టీడీపీ హయాంలో 13 వ ఆర్ధిక సంఘ నిధులను కూడా సకాలంలో వినియోగించక నిర్ధేశిత గడువు పూర్తయ్యాక కేంద్రాన్ని అభ్యర్ధించి గడువు పొడిగించుకొంది అప్పటి ప్రభుత్వం. అయితే వైసీపీ మద్దతుదారులు అధికారంలో ఉన్న స్థానిక సంస్థల్లో ఏ పనులూ జరగనివ్వకుండా ప్రభుత్వ అధికారుల ద్వారా కొర్రీలు వేయడం, వైసీపీ అనుకూల పంచాయితీ సర్పంచ్ ల చెక్ పవర్ ఏకపక్షంగా రద్దు చేయడం వంటి చర్యలతో ఆయా సంస్థల్లో నిధులు వ్యయం చేయక చివరికి కొన్ని సంస్థలకు ఇచ్చిన నిధులు కేంద్రం వెనక్కి తీసుకొన్న దుస్థితి అప్పటి ప్రభుత్వం కల్పించింది .
ఇప్పటి పరిస్థితులు పూర్తి భిన్నం …
2018 లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎస్ఈసీ నిమ్మగడ్డ సకాలంలో జరపనందున ఆయా సంస్థలకు కేంద్రం నుండి 2019 మార్చ్ ఆఖరులో కేటాయింపులు రద్దు అయ్యే స్థితిలో కొత్తగా పాలనా పగ్గాలు అందుకొన్న ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి నిధులు రాబట్టుకోవటంలో సక్సెస్ అయ్యారు. కానీ కోవిడ్ 19 కారణంగా లాక్ డౌన్ విధింపు, కరోనా సేవలు, వెనువెంటనే స్థానిక ఎన్నికలు, ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాలతో రాష్ట్ర యంత్రాంగం సతమతమవుతూ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించలేక స్థానిక పంచాయితీలకు చెందిన 14 వ ఆర్ధిక సంఘ నిధులు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది .
కరోనా కారణంగా సకాలంలో నిధులు ఖర్చు చేయలేకపోయామని, ఈ నిధులను వచ్చే ఆర్థిక ఏడాదికి బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసేందుకు మరో ఏడాది సమయం ఇచ్చింది. 2022 మార్చి ముగిసే లోపు ఈ నిధులు తప్పకుండా వినియోగించాలని స్పష్టం చేయడంతో ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థలకు ఊరట లభించింది.
2016–17 ఆర్థిక ఏడాదిలో ప్రారంభమైన 14వ ఆర్థిక సంఘం.. ఐదేళ్ల కాలపరిమితి 2020–21 ఆర్థిక ఏడాది వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 15వ ఆర్థిక సంఘం అమలులోకి వస్తుంది. ఐదేళ్లపాటు 15వ ఆర్థిక సంఘం కొనసాగుతుంది.
ఇప్పుడు కేంద్రం తీసుకొన్న నిర్ణయంతో 2022 మార్చ్ 31 లోపు ఈ నిధులు వినియోగించుకునే వెసులుబాటు దక్కింది . ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల ద్వారా ఎన్నికైన నూతన కార్యవర్గాలకు తమ గ్రామాల్ని అభివృద్ధి చేసుకొనే సువర్ణ అవకాశం ఈ నిర్ణయం ద్వారా కలిగింది అని చెప్పొచ్చు. పంచాయతీలకు ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు కీలకం. పంచాయతీ జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాల ద్వారా ప్రతి ఏడాది విడతల వారీగా నిధులు మంజూరు చేస్తుంది. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీల నిర్వహణ, అంతర్గత రహదారులు, వీధి దీపాలు తదితర పనులకు ఈ నిధులు ఖర్చు చేయవచ్చు.