iDreamPost
android-app
ios-app

తెలుగుదేశం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తుందా?

  • Published Sep 21, 2021 | 3:24 AM Updated Updated Sep 21, 2021 | 3:24 AM
తెలుగుదేశం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తుందా?

స్థానిక ఎన్నికల సమరం ముగిసింది. పార్టీల బలాబలాలు బయటపడ్డాయి. స్థానిక ఎన్నికలే సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయనడం అతిశయోక్తి అవుతుంది గానీ 2019 ఎన్నికల నాటి ప్రజల మూడ్ నేటికీ మారలేదనే సంకేతాలను తాజా ఫలితాలు ఇచ్చాయి.

ఏపీలో జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన ముగుస్తున్న తరుణంలో కూడా జనాల్లో గట్టిపట్టు నిలుపుకున్నట్టు స్పష్టమవుతోంది. అదే సమయంల విపక్ష టీడీపీ తీరు విడ్డూరంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరిస్తూ రెండోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందనే అభిప్రాయం వెలిబుచ్చుతోంది. ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళతారా అంటూ సవాల్ చేసిది. అయితే టీడీపీ అభిప్రాయం నిజమని నిరూపించుకునేందుకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లండి అంటూ పాలకపక్షం వైపు నుంచి ప్రతిసవాల్ రావడం టీడీపీని సతమతం చేస్తోంది.

Also Read:కేటిఆర్ ఉద్యోగం ఇచ్చారు సరే, కాని ఆమె జీవితంలో ఉన్న మరో పెద్ద కష్టం ఏంటీ…?

చంద్రబాబు మాత్రం వాగాడంబరం చూపుతున్నారు. ధైర్యముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. పైగా తాము వదిలేసిన ఎన్నికల్లో గెలిచారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. అదే నిజమయితే టీడీపీ గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నీ వదలుకున్నట్టేనా..అలాంటి ప్రకటన చంద్రబాబు చేయగలరా.. ఆయన ప్రకటించినా, గెలిచిన వారు వదులుకుంటారా.. ఇన్ని ప్రశ్నలుండగానే బాబు మాత్రం తాను చెప్పినట్టుగానే అంతా జరిగిపోతుందనే భ్రమలో ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆయన ఎన్నికల హామీలు కూడా గుప్పిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే హౌసింగ్ రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని, కరెంటు చార్జీల భారాలు తగ్గిస్తామని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

ఓవైపు తమకే జనం మద్ధతు ఉందని చెబుతారు, మరోవైపు ఎన్నికల హామీలు కూడా మొదలెడతారు. తామే బలంగా ఉన్నామని విశ్వసిస్తున్నారు. ఇన్ని సానుకూలతలున్నాయని నిజంగా చంద్రబాబు నమ్ముతున్నట్టయితే ఇక తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు రెడీ కావచ్చు కదా అన్నది చాలామందిలో వస్తున్న ప్రశ్న. అయితే ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం ప్రస్తుతానికి టీడీపీకి ఉందా అంటే ప్రశ్నార్థకమే.

Also Read: వైఎస్సార్ సీపీ జైత్రయాత్ర.. ఏ అంశాలు కలిసొచ్చాయి?

కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పరిషత్ ఎన్నికల్లో ఓటమి ప్రభావం నుంచి కార్యకర్తల దృష్టి మళ్లించే యత్నంలో ఆయన ఉన్నట్టుగా తాజా వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. ప్రజల తీర్పుని పరిగణలోకి తీసుకుని దానికి తగ్గట్టుగా పార్టీని సంస్కరించుకోవాల్సింది పోయి, పాలక వైఎస్సార్సీపీని, జగన్ ని నిందించడమే తమ నినాదం, విధానం అన్నట్టుగా చంద్రబాబు మార్చుకున్న వైనం తెలియజేస్తోంది. పార్టీని గాడిలో పెట్టడానికి బదులు నిత్యం జగన్ ని విమర్శిస్తూ సాగడమే శ్రేయస్కరమనే పద్ధతికి ఆయన వచ్చేసినట్టు అర్థమవుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన 23 మందిలో ఇప్పటికే నలుగురు చంద్రబాబుకి దూరమయ్యారు. మిగిలిన 19 మందిలో గంటా శ్రీనివాసరావు తటస్థుడిలా వ్యవహరిస్తున్నారు. అనగాని సత్యప్రసాద్ ఎటు ఉంటారో అనేది అయోమయమే. ఇక బాబు బ్యాచ్ లో నికరంగా ఉన్నది ఆయన, వియ్యంకుడు బాలయ్యతో కలుపుకుని 17 మంది. ఇక వారిలో కూడా ఉప ఎన్నికలకు వెళదామా అంటే ఎంతమంది సిద్ధమవుతారన్నది అతి పెద్ద ప్రశ్న.

కుప్పం,హిందూపురం ,ఉరవకొండ లాంటి నియోజక వర్గాలలో ఒక్కమండలం కూడా గెలవని పరిస్థితుల్లో ఉప ఎన్నికలను ఎదుర్కోవాలంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా బలమైన ప్రజామద్ధతుతో అధికార పార్టీ ఉన్న సమయంలో వారిని నిలువరించడం ఆషామాషీ కాదన్నది టీడీపీ నేతలకు కూడా తెలిసిన సత్యం. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం కామన్ మ్యాన్ ఎటువైపు అన్నది తేలిపోయింది. దాంతో ఉప ఎన్నికలు అనే వాదనే టీడీపీలో కలవరం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం సతమతం చేస్తుందనడానికి సంకోశించాల్సిన అవసరం లేదు.

Also Read:వామ్మో తాడిపత్రిలో ఇంత మెజారిటీనా..? జేసీ వర్గంలో కలవరం