అమరావతి తో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కొరకు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన అంతర్జాతీయ దిగ్గజ కన్సల్టింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, తమ మధ్యంతర నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తుంది. జియన్ రావు కమిటీ తో పాటే ఈ కమిటీ చేత కూడా రాజధాని పై అధ్యయనం చేయిస్తున్నట్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి సమ్పర్పించిన తమ మధ్యంతర నివేదిక లో ప్రధానంగా ఏముందనే దానిపై అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం గ్రీన్ ఫీల్డ్ రాజధాని ( అంటే కొత్తగా నిర్మించే రాజధాని) కంటే బ్రౌన్ ఫీల్డ్ రాజధాని (ఇప్పటికే ఉన్న నగరం) అయితే సత్వరం అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉందని సూచించినట్టు తెలుస్తుంది.ఈ కమిటీ తన పూర్తిస్థాయి నివేదికని ఈ నెల చివరికల్లా అందించనున్నట్టు తెలుస్తుంది. ఈ కమిటీ పూర్తిస్థాయి నివేదికని ప్రభుత్వానికి అందించాక దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రానికి 3 రాజధానులు రావొచ్చని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే తమ నివేదికని సమర్పించిన జియన్ రావు కమిటీ కూడా విశాఖ పట్టణాన్ని ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ చెయ్యాలని సూచించడంతో ఇప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ కు బలం చేకూర్చుతూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా తమ మధ్యంతర నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించడం తో ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్న వాదనకి బలం చేకూర్చినట్టయింది. ఇప్పటికే జియన్ రావు కమిటీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో చర్చించిన ప్రభుత్వం ఈ కమిటీ పూర్తి స్థాయి నివేదిక కూడా వచ్చిన అనంతరం ఈ రెండు కమిటీల పై సమగ్రంగా అధ్యయనం చేసి జనవరి మొదటి వారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది