iDreamPost
android-app
ios-app

ఆర్టీసీలో ఏ ఒక్కరినీ తొలగించలేదు: మంత్రి పేర్ని నాని స్పష్టత

ఆర్టీసీలో ఏ ఒక్కరినీ తొలగించలేదు: మంత్రి పేర్ని నాని స్పష్టత

దున్నపోతు ఈనింది అంటే గాటిన కట్టేయ్‌ అన్న సామెత చందంగా విపక్ష పార్టీలు, వాటి మీడియా తీరు ఉంటోంది. గత కొన్ని రోజులుగా ఏ మాత్రం ఆధారం లేకుండా ఆర్టీసీలో 6వేల మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించారంటూ హడావుడి చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. ఎవరో కొందరు వాట్సప్‌ గ్రూపుల్లో ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌రెడ్డి పేరు మీద నకిలీ ఉత్తర్వులు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(పేర్ని నాని) సమాధానం చెబుతూ.. విష ప్రచారంపై మండిపడ్డారు. త్వరలో పరిమిత స్థాయిలో ప్రజా రవాణా ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా బీమా సౌకర్యం ఉన్న పర్మినెంట్‌ ఉద్యోగులను ముందుగా డ్యూటీలో చేరమని సర్క్యులర్‌ జారీ చేశామే తప్ప, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్లు అందులో లేదని స్పష్టం చేశారు. విమర్శలు చేసే వారు ముందుగా ఉత్తర్వులను క్షుణ్నంగా చదవాలని హితవు పలికారు. 50 రోజులుగా ఆర్టీసీ బస్సులు తిరకపోవడంతో ఆదాయం లేదని, ఈ నేపథ్యంలోనే కొందరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఈ నెల జీతాలు ఆలస్యమయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడమే ఉంటుందనిగానీ, తొలగించడం ఎంత మాత్రం ఉండబోదని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.

దశాబ్దాల కలను నెరవేర్చిన ప్రభుత్వం

ప్రభుత్వంలో విలీనం కావాలనేది ఆర్టీసీ సిబ్బంది దశాబ్ధాలుగా కోరుతున్న కోరిక. ఎన్నో ప్రభుత్వాలు ఆ విన్నపాన్ని పట్టించుకోలేదు. గత ఎన్నికల ముందర ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కలసి తమ విన్నపాలను అందజేశాయి. అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే గత డిసెంబర్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి పబ్లిక్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. 5 నెలలుగా పీటీడీ నుంచే సిబ్బందికి జీతాలు అందుతున్నాయి. అలాగే సంస్థను అప్పుల ఊబి నుంచి బయట పడేయడానికి నిధులను కూడా కేటాయించింది. ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఇంత శ్రమ పడుతున్న ప్రభుత్వంపై కొందరు అసత్య ఆరోపణలు చేయడం దారుణమని పలువురు ఆర్టీసీ సిబ్బంది పేర్కొంటున్నారు. గత రెండు నెలలుగా ప్రజా రవాణాలోని ఏ ఒక్క బస్సు తిరగడం లేదు. పైసా ఆదాయం లేదు. అయినా తమకు జీతాలు సక్రమంగా ఇస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై పలువురు మండిపడుతున్నారు.