iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో బాలల భద్రతకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అభం శుభం తెలియని బాలలను వేధించటం, వెట్టిచాకిరీతో పాటు లైంగిక వేధింపులు వంటివి వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. వీటిని నిరోధించడానికి ఏపీ సర్కారు పలు చర్యలు చేపట్టింది. వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలల విద్య, వైద్యం, సంరక్షణ, సంక్షేమం వంటి కీలక అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బాలల భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. వెట్టిచాకిరీ, బాల్య వివాహాల నుంచి విముక్తి చేస్తున్నారు. బాలలపై లైంగిక వేధింపుల నిరోధానికి కఠిన చట్టాలు తెచ్చి, నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకొనేలా చేస్తున్నారు.
బాలల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు..
కరోనా కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మిగిలిన రాష్ట్రంలోని 255 మంది బాలలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రభుత్వం అందించింది. వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల్లో ఒకర్ని కోల్పోయిన బాలలు రాష్ట్రంలో 8,131 మంది ఉన్నారు. వారిని కూడా ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. కరోనా బారిన పడిన బాలలకు తక్షణ చికిత్స కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, మంచి ఫలితాలు సాధించింది. దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీసు స్టేషన్లు, దిశ ల్యాబ్స్ వంటి పటిష్టమైన చర్యలతో మహిళలతోపాటు బాలలపైనా లైంగిక వేధింపులను అరికడుతోంది. నిందితులకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటోంది.
Also Read : Ap Government – ఉద్యోగ సాధనకు నైపుణ్యాల మెరుగు
ప్రధానంగా బాలలపై అత్యాచారాలకు పాల్పడే మృగాళ్లపై పోక్సో చట్టం ప్రయోగించి కఠిన శిక్షలు పడేలా చేస్తోంది. అనాథ బాలల సంరక్షణ, దత్తత కోసం జువైనల్ జస్టిస్ యాక్ట్ -2015 ప్రకారం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గ దర్శకాలు జారీ చేసింది. 18 ఏళ్లు నిండని బాలలకు జరిగే పెళ్లిళ్లను అడ్డుకొని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో 165 బాల్య వివాహాలను అడ్డుకొని వాటి నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మాట వినని వారిపై కేసులు నమోదు చేశారు.
విద్య,వైద్య సదుపాయాలు..
55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్ల లోపు వయసు ఉన్న బాలలకు పౌష్టికాహారం, వైద్యం, ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందిస్తోంది. స్వచ్ఛ పథకం ద్వారా 10 లక్షల మంది కిశోర బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ అందించారు. గత రెండేళ్లలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్లో 34,037 మంది వీధి బాలలను రక్షించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అనాథలను బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉంచి విద్య, వైద్యం, పౌష్టికాహారం అందిస్తున్నారు.
బాలల సంరక్షణ, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు..
రాష్ట్ర ప్రభుత్వం బాలల సంరక్షణ, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతోంది. బాలల అక్రమ రవాణా నిరోధానికి, లైంగిక వేధింపులు అరికట్టేందుకు పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తోంది. దిశ, జీరో ఎఫ్ఐఆర్, నిర్భయ చట్టం, పోక్సో యాక్ట్ వంటి అనేక అస్త్రాలను బాలల సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. బాలల సమస్యలను గుర్తించిన వెంటనే డయల్ 1098, 181 తోపాటు దిశ యాప్ ను కూడా ఉపయోగించుకొని ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
Also Read : Ap Government – ఆర్బీకేల పటిష్టతపై ఏపీ సర్కారు దృష్టి