iDreamPost

కరోనా లాక్ డౌన్ పొడిగించాలా? వద్దా? : ప్రధాని మోడీతో అమిత్‌ షా కీలక భేటీ

కరోనా లాక్ డౌన్ పొడిగించాలా? వద్దా? : ప్రధాని మోడీతో అమిత్‌ షా కీలక భేటీ

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనతో అమిత్‌ షా సమావేశం అయ్యారు. దేశంలో కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌ తదితర అంశాలపై మోడీతో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్‌ షా లాక్‌డౌన్‌పై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జరిగిన ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.

గడిచిన 24గంటల్లో దేశంలోనే అత్యధికంగా 7,467 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య జరిగిన ఈ భేటీలో కొవిడ్‌ మహమ్మారి కట్టడికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే అంశంపై కీలకంగా చర్చ జరిగినట్టు సమాచారం. సిఎంలు తనతో వ్యక్తపరిచిన అంశాలను మోడీకి అమిత్‌ షా వివరించినట్టు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌పై ఎలా ముందుకెళ్లే అంశంపై నేడు (శనివారం) ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేలా రాష్ట్రాలకు అనుమతిస్తూ లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే మంచిదని పలువురు సిఎంలు అమిత్‌ షాతో చెప్పినట్టు తెలుస్తోంది. సోమవారం నుంచి ఎలా ముందుకెళ్లాలనే దానిపై  సిఎంలు తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. జూన్‌ 1 నుంచి ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపై గత కొన్ని రోజులుగా ప్రధాని కార్యాలయం (పిఎంవో) ప్రస్తుత లాక్‌డౌన్‌ తీరును సమీక్షిస్తోంది. 

మరోవైపు, అమిత్‌ షాతో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ గోవా సిఎం ప్రమోద్‌ సావంత్ లాక్‌డౌన్‌పై స్పందించారు. లాక్‌డౌన్‌ను మరికొన్ని వారాల పాటు పొడిగిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కేంద్రం మరో 15 రోజులు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే, తమ రాష్ట్రానికి కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. భౌతిక దూరం నిబంధనలతో 50శాతం సామర్థ్యంతో పనిచేసేందుకు రెస్టారెంట్లను అనుమతించాలని కోరానన్నారు. చాలా మంది ప్రజలు జిమ్‌లను కూడా పునఃప్రారంభించాలని కోరుకుంటున్నారని సావంత్‌ తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్‌ -4 ఆదివారంతో ముగుస్తుండటంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ దేశ వ్యాప్తంగా నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి