iDreamPost

నన్ను చంపడానికంటే ముందు అత్యాచారం చేయాలనుకున్నారు: మణిపూర్‌ బాధితురాలు

  • Published Jul 24, 2023 | 1:01 PMUpdated Jul 24, 2023 | 1:01 PM
  • Published Jul 24, 2023 | 1:01 PMUpdated Jul 24, 2023 | 1:01 PM
నన్ను చంపడానికంటే ముందు అత్యాచారం చేయాలనుకున్నారు: మణిపూర్‌ బాధితురాలు

మణిపూర్‌లో మూడు నెలల క్రితం అమానుష సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. ఆపై వారి మీద సామూహిక అత్యాచారం చేసిన వీడియో దేశంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ఘటనపై స్పందించారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ఈ దారుణానికి సంబంధించి ఒకరిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న గొడవల కారణంగా ఈ దారుణం చోటు చేసుకుంది. అసలు ఇంతటి దారుణం చోటు చేసుకోవడానికి కారణం ఏంటి.. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది బాధితుల మాటల్లోనే..

బాధితురాలు మాట్లాడుతూ.. ‘‘మే 15న ఈ దారుణం చోటు చేసుకుది. నేను డబ్బులు డ్రా చేయడానికి ఇంపాల్‌లోని ఒక ఏటీఎం సెంటర్‌కు వెళ్లాను. ఆ సమయంలో రెండు వాహనాలు నా దగ్గరకు వచ్చాయి. ఒకటి నా ముందు ఆగింది.. ఇంకొకటి నా వెనక ఆగింది. అవి రెండో బొలేరో వాహనాలు. సాయంత్రం 5 గంటల సమయంలో నన్ను కిడ్నాప్‌ చేశారు. అక్కడే ఉంటే పోలీసులు లేదా ఎవరైనా వచ్చి కాపాడే అవకాశం ఉందని భావించి.. నన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరి కొందరిని అక్కడికి రప్పించారు. వారిలో ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ ఉన్నారు. ముందు నాపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేయాలని భావించారు. వారి మాటలు విని నాకు భయమేసింది. మీకు అక్కాచెల్లెళ్లు లేరా అని ప్రశ్నించాను. వారు నా నోరు మూయించారు. ఆ తర్వాత గన్స్‌ లోడ్‌ చేశారు. నన్ను భయపెట్టడానికి రెండుమూడు సార్లు కాల్పులు కూడా జరిపారు’’ అని గుర్తు చేసుకుంది.

‘‘ఆ తర్వాత నాకు గన్‌ గురి పెట్టారు. తుపాకీ అడుగు భాగంతో నా కళ్ల దగ్గర పదే పదే కొట్టారు. ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. సాయంత్రం 5 గంటల నుంచి నన్ను టార్చర్‌ పెట్టడం మొదలు పెడితే.. సూర్యాస్తమయం వరకు ఆ హింసా కాండ కొనసాగింది. ముందు కేవలం ఆడవాళ్లు మాత్రమే నా మీద చేయి వేయాలని నిర్ణయించుకున్నారు. వారు నన్ను కొట్టడంతో స్పృహ కొల్పోయాను. కొంతసేపటికి నా ముఖం మీద నీళ్లు చల్లడంతో మెలకువ వచ్చింది. ఏం జరిగిందో నాకు గుర్తు లేదు’’ అని చెప్పుకొచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. బాధితురాలపై అ‍త్యాచారం జరిగిందని తెలిపారు. సుమారు మూడు నెలల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరలవ్వడంతో.. ఈ దారుణం గురించి తెలిసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి