iDreamPost

ఘోర ప్రమాదం.. గిర్డర్‌ యంత్రం కూలి 15 మంది మృతి

  • Published Aug 01, 2023 | 7:55 AMUpdated Aug 01, 2023 | 7:55 AM
  • Published Aug 01, 2023 | 7:55 AMUpdated Aug 01, 2023 | 7:55 AM
ఘోర ప్రమాదం.. గిర్డర్‌ యంత్రం కూలి 15 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గిర్డర్‌ యంత్రం కూలడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో సుమారు 15 మంది మృత్యువాత పడ్డారు. థానే జిల్లాలోని షాపూర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవే ఫేజ్-3 రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఒక్కసారిగా గిర్డర్‌‌లు మోసే యంత్రం కుప్పకూలి కార్మికులపై పడింది. ప్రమాదం చోటు చేసుకున్న స్థలంలోనే సుమారు 15మంది కార్మికులు మృతి చెందారు.. పలువురికి గాయాలు అయ్యాయి. మృతులను, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. పోలీసులు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు మొదలు పెట్టారు

సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి ఈ గిర్డర్ కింద పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడే 15 మంది చనిపోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఘటనా స్థాలానికి చేరుకుని.. పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. సుమారు 701 కిలో మీటర్ల పొడవున ఈ సమృద్ధి మహామార్గ్‌ను.. నాగ్‌పూర్‌-ముంబై మధ్య నిర్మిస్తున్నారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో రెండు దశలు పూర్తికాగా.. ప్రస్తుతం మూడో దశ పనులు జరుగుతున్నాయి. మే 26న రెండో దశలో భాగంగా నిర్మించిన నాసిక్‌లోని షిర్డీ-భర్వీర్‌ మధ్య నిర్మించిన మార్గాన్ని సీఎం షిండే ప్రారంభించారు. దీంతో సమృద్ధి మహామార్గ్‌లో 600 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మూడో దశ పనులు కూడా ముగుస్తాయని భావిస్తున్న తరుణంలో ఇలాంటి దారుణ చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి