iDreamPost

రౌడీ హీరో సినిమా ఆలస్యం తప్పదా

రౌడీ హీరో సినిమా ఆలస్యం తప్పదా

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేని నేపథ్యంలో తొందరపడి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం లేదు. ఇటీవలే ఇందులో మైక్ టైసన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడని వార్త వచ్చాక హైప్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా ఫ్లేవర్ కు మరో టచ్ ఇచ్చారు పూరి. అయితే ఇక్కడో చిక్కొచ్చి పడిందని టాక్. లైగర్ కోసం మైక్ టైసన్ ఇండియాకు రావడం లేదు. కరోనా నేపథ్యంలో రిస్క్ చేసేందుకు ఇష్టపడటం లేదట. తన భాగం వరకు అమెరికాలోనే షూట్ చేసుకోమని అలా అయితేనే పాత్ర చేస్తానని ముందే చెప్పారట.

దానికి అనుగుణంగానే లైగర్ టీమ్ యుఎస్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంది. కానీ వీసాలు రావడంలో ఆలస్యం జరుగుతుండటంతో ఇంకొంత టైం పెట్టొచ్చని తెలిసింది. టైసన్ కాల్ షీట్లు కూడా అక్కడికి వెళ్లాకే తీసుకోబోతున్నట్టుగా సమాచారం. రెమ్యునరేషన్ ఎంతనే విషయం బయటికి రాలేదు కానీ భారీగానే ముట్టజెప్పబోతున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద మొదటిసారి కథకు సంబంధం ఉన్న పాత్ర చేస్తున్న మైక్ టైసన్ ఇమేజ్ ఓవర్ సీస్ బిజినెస్ లో బాగా హెల్ప్ అయ్యేలా ఉంది. ఇంగ్లీష్ వెర్షన్ లోనూ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అతని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాత్ర తాలూకు డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ స్థాయి సక్సెస్ ని మళ్ళీ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో తన సహజ శైలికి భిన్నంగా పూరి జగన్నాధ్ లైగర్ కి చాలా టైం తీసుకుంటున్నారు. కరోనా వల్ల బ్రేక్ పడినప్పటికీ అందరి కంటే ఆలస్యంగా రీ షూట్ స్టార్ట్ చేసుకుంది ఈ సినిమానే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రమ్యకృష్ణ, రోనీ రాయ్ తదితరులు ఇతర తారాగణం. సంగీతం ఎవరు సమకూరుస్తున్నారనే విషయం మీద ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. ముందు మణిశర్మ అన్నారు. తర్వాత తనిష్క్ భాగ్చీ పేరు బయటికి వచ్చింది. ఫైనల్ ఎవరుంటారు మాత్రం తెలియదు. పూరి ఛార్మీలతో పాటు కరణ్ జోహార్ దీనికి సహనిర్మాతగా వ్యవహరించడం విశేషం

Also Read : గొర్రెల కాప‌రుల జీవ‌న సంగీతం కొండ‌పొలం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి