iDreamPost

గోదావరి పందెం కోళ్లు రెడీ…

గోదావరి పందెం కోళ్లు రెడీ…

సంక్రాతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జరగాల్సిందే. పోలీసులు అడ్డుకున్నా…సుప్రీంకోర్టు వద్దని చెప్పినా ఇక్కడి ప్రజలు, రాజకీయ నాయకులు వెనక్కు తగ్గరు. ఈ సంవత్సరం కూడా గోదావరి జిల్లాలు కోడి పందేలకు సిద్ధమైపోతున్నాయి. రెండు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ప్రత్యేక బరులు ఏర్పాటుకు రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు.

కోళ్లకు కఠోర శిక్షణ

సంక్రాంతి బరిలో ఢీ అంటే ఢీ అనేందుకు కోడిపుంజులు రెడీ అవుతున్నాయి.. రోజూ కఠోర శిక్షణ.. బలవర్ధక ఆహారం.. క్రమతప్పని వ్యాయామంతో కోళ్లను పెంపకందారులు సిద్ధం చేస్తున్నారు. కోడి పందేలకు సంబంధించి భీమవరం పుంజులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఒక్కో పుంజు గరిష్టంగా రూ.50 వేలు పలుకుతోందంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.పెద్ద పండుగకు మరో 15 రోజులే ఉండటంతో భీమవరం చుట్టుపక్కల ఉన్న పందెం రాయుళ్లు కోళ్లను సిద్ధంచేస్తున్నారు.

ఢీ అంటే ఢీ

భీమవరం పరిసర ప్రాంతాల్లో కొందరు పుంజులను కేవలం సంక్రాంతి పండుగ పందేల నిమిత్తమే పెంచుతారు. వాటిని చంటి పిల్లల్లా చూసుకుంటూ ఆహారం, వ్యాయామాల పరంగా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పుంజుల శిబిరాల వద్ద జీతగాళ్లను పెట్టి మరీ వాటిని పెంచుతారు. దీంతో ఈ ప్రాంతంలో కోడి పుంజులు పెంచడం హోదాకు చిహ్నంగా మారింది.

ఆహారం

పందెం పుంజులకు అందించే ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. మటన్‌ కైమా, బాదం, జీడిపప్పు, కోడిగుడ్డు, చోళ్లు, గంట్లు, వడ్డు మిశ్రమంగా కలిపి ఆహారంగా అందిస్తారు. రోజూ మటన్‌ ఖైమా తప్పనిసరి. ఉదయం బాదం, మట¯ŒS కైమా, సాయంత్రం గంట్లు, చోళ్లు పెడతారు. ఉదయం పుంజులతో ఈత కొట్టిస్తారు. కత్తులు లేకుండా డిక్కీ పందేల మాదారి పుంజులు తలపడేలా చూస్తుంటారు. దీని ద్వారా పుంజు సామర్థ్యాన్ని పెంపకందారులు అంచనా వేస్తారు. ప్రత్యేక ఆవాసాల్లో(గూళ్లు) వీటిని ఉంచుతారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేస్తారు.

కోడిపుంజు పందానికి సిద్ధం చేయడానికి మూడు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఈ కాలంలో వీటికి అందించే ఆహారం, భద్రత తదితరాలకు∙పెంపకందారులు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తారు. ఖర్చుకు వెనకాడకుండా మంచి సామర్థ్యం ఉన్న పుంజులను సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.

ధర ఎక్కువే…

భీమవరం పుంజుకు పొగరే కాదు ధర కూడా ఎక్కువే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ఇక్కడకు వచ్చి పుంజులు కొనుగోలు చేస్తుంటారు. రకాన్ని బట్టి కోడి ధర రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతుంది. పందెంరాయుళ్లు ముందుగా వచ్చి వారికి కావాల్సిన రకాన్ని ఎంపిక చేసుకొన్టి కొంత అడ్వాన్సు ఇచ్చి వెళుతుంటారు. దీంతో సంక్రాంతి సీజ¯ŒSకు ముందే పెంపకందారులకు పుంజులు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి.

పుంజుల రకాలు

పచ్చకాకి, నల్ల నెమలి, పింగలి, సేతువా, కక్కరాయి (ఎరుపు, నలుపు రకాలు), అబ్రాస్‌ (తెలుపు, ఎరుపు రకాలు), మైల (ఎరుపు, నలుపు రకాలు, డేగ, పండు డేగ, నల్ల బొట్టుల తేతువా, గేరువా, రసంగి(ఎరుపు, తెలుపు రకాలు), పెట్టమర్రు, కాకి డేగ పర్ల, పర్ల రకాలు ఎక్కువుగా పందాలకు వినియోగిస్తుంటారు.

బైండోవర్‌ కేసులు

కోడి పందేల నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పును అమలు చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ స్పష్టం చేశారు. ముందస్తుగా బైండోవర్‌ కేసులు పెడుతున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ జూదంలేని పందేలు నిర్వహించి తీరుతామని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పటికే ప్రకటించారు. పై స్థాయి నుంచి కూడా పండుగ మూడు రోజులు చూసీ చూడనట్లు ఉండమని పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి ఈసారి పందెం రాయుళ్లు నెగ్గుతారో…పోలీసులది పైచేయి అవుతుందో…!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి