iDreamPost

పారిపోయేందుకు తాను చంద్రబాబును కాదు – కేఏ పాల్

పారిపోయేందుకు తాను చంద్రబాబును కాదు – కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గత కొద్దికాలంగా పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చి హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్రంగా సొంత రాష్ట్రమైన ఏపీని వదిలిపెట్టి తెలంగాణ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టడం చర్చకు తెరలేపుతోంది. ఇదే సమయంలో తాజాగా ఆయనపై సిరిసిల్లా జిల్లా పర్యటన సమయంలో దాడి జరగడం కలకలంగా మారింది.

అయితే దీనిపై స్పందించిన కేఏ పాల్ టీఆర్ఎస్ పార్టీ యువనేత మంత్రి కేటీఆర్ మనుషులు తనపై దాడి చేశారని కేఏ పాల్ ఆరోపించారు. అయితే ఇదే సమయంలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు.

అమీర్ పేటలోని ప్రజా శాంతి పార్టీ పార్టీ కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి చేసి తాను రైతుల్ని కొట్టానని అబద్దాలు చెబుతున్నారని వాపోయారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీసుకు వెళ్తుండగా తనను హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. పోలీసులు కేటీఆర్ మనుషుల్లా వ్యవహరిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.

డీజీపీ కనీసం తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పేంటో చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని కేఏ పాల్ తప్పుబట్టారు. చాలా మంది పోలీస్ కమిషనర్లు అధికారులు కేసీఆర్ చెప్పినట్టు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్కు వార్నింగ్ ఇచ్చారు కేఏ పాల్.. నువ్వు పుట్టకముందు నేను ప్రపంచాన్ని వణికించానన్నారు. కేసీఆర్ కేటీఆర్ గుండాలతో రాష్ట్రాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.

తనపై తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. తాను ఆంధ్రావాడినైతే కేసీఆర్ కూడా ఆంధ్రావాడేనని అన్నారు. తండ్రీ కొడుకులంటే తనకేం భయం లేదన్న పాల్.. పారిపోయేందుకు తాను చంద్రబాబును కాదని అన్నారు. తనను ఎంతకాలం నిర్బంధిస్తారో చూస్తానని అన్నారు. నెల రోజుల కిందనే నన్ను చంపుతారు అని చెప్పానన్నారు కేఏ పాల్..

కానీ నేను దేనికి భయపడను.. అసలైన పోరాటం ప్రారంభం అయ్యిందని ప్రకటించారు. 119 నియోజకవర్గాల్లోతాను పర్యటిస్తానని ప్రకటించారు. తనపై జరిగిన దాడి ఘటనపై హోమ్ మినిష్టర్ అమిత్ షా కి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. అధికారులు ముఖ్యమంత్రిపై హైకోర్టు సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తానని ప్రకటించారు. రాష్ట్రపతిని కలవబోతున్నాను ప్రెసిడెంట్ రూల్ కోసం ఫిర్యాదు చేస్తానని కేఏ పాల్ చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి