iDreamPost

అందరి నోళ్లూ బంద్!

అందరి నోళ్లూ బంద్!

ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగ్గానే దానిని ఎలా క్యాష్ చేసుకుందామా అనుకుని కొన్ని శక్తులు పొంచి ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది విశాఖపట్టణం గ్యాస్ లీకేజీ విషయంలోకూడా! ఆంధ్రప్రదేశ్ రాజధానిని తరలించడానికి సాగుతున్న ప్రయత్నాలను ఆటంక పరచడానికి ఇదొక సాకుగా తీసుకోవాలనుకున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఒకడుగు ముందుకేసి… పాపపుణ్యాలనుకూడా జత చేయబోయింది.

అనుకున్నంత ప్రమాద స్థాయి కనిపించకపోయేసరికి ఫేస్ సేవింగ్లో పడ్డారు టీడీపీ లీడర్లు. మధ్యాహ్నానికల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడం, వెంట వెంటనే సహాయక చర్యలను పర్యవేక్షించడం, బాధితులకు మనోధైర్యాన్ని కల్పించడం, మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించడం… ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఎలాంటి హంగు ఆర్భాటం, ప్రచార పటాటోపాలు లేకుండానే యువ నేత జగన్ చక్కదిద్దేసరికి ఏం చేయాలో పాలుపోని డైలమాలో పడ్డాయి ‘దేశం’ శ్రేణులు.

Also Read:ప్రజా సేవకుడి మానవత్వానికి మచ్చుతునక

తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య చాలా అదుపులో ఉండడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. గ్యాస్ లీకేజీ వార్తలందిన మరుక్షణమే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జిల్లా పాలనా యంత్రాంగం రంగంలో దిగిపోయింది. కరోనా వైరస్ రోగులతో నిండిపోయిన ఆసుపత్రుల్లో గ్యాస్ బాధితులకు సేవలు అందించడంలో వైజాగ్ వైద్య సిబ్బంది ఎక్కడా తాత్సారం చేయలేదు.

పొద్దుటి నుంచి గ్యాస్ లీకేజీ వార్తలను చిలవలు పలవలుగా అందించిన న్యూస్ చానెళ్లు సైతం సకాలంలో అందుతున్న సేవలను కొనియాడక తప్పలేదు. తొలి వార్తలు ఖరారు కావడానికి ముందే ‘లక్ష మంది గ్యాస్ బాధితులు’ అని స్క్రోలింగ్లు వేసి జనాల్ని భయాందోళనలకు గురి చేసిన ఒక చానెల్… చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా మీట్ మొత్తాన్ని లైవ్లో వేసుకోవలసి వచ్చింది.

Also Read:గ్యాస్ లీక్ ప్రమాదం- టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఉన్నదున్నట్లు చెప్పారు !!

గతంలో ఇదే వైజాగ్లో రెండు ఘోర గ్యాస్ ప్రమాదాలు సంభవించాయి. అ రెండు సందర్భాల్లోనూ చంద్రబాబునాయుడే ప్రభుత్వంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన చేసిన హడావుడితో పోలిస్తే… ఇప్పుడు అంతా సైలెంట్గా సాగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్లానింగ్ అద్భుతంగా పనిచేసింది. ఊహించని రీతిలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నష్ట పరిహారాలు బాధితులకు గొప్ప రిలీఫ్ నిచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే, ఇటువంటివి మున్ముందు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి