iDreamPost

అది ఖర్చు కాదు పెట్టుబడి

అది ఖర్చు కాదు పెట్టుబడి

సీఎం జగన్‌ డబ్బులు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ప్రజలకు ఊరికే డబ్బులు ఇస్తున్నారు. నాడు నేడు పేరుతో స్కూళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.. అంటూ మాట్లాడే వారికి సీఎం జగన్‌ ఈ రోజు మన పాలన – మీ సూచనలో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అన్న సీఎం జగన్‌.. విద్యపై చేసేది ఖర్చు కాదని.. పెట్టుబడి అని విమర్శలు చేసే వారి నోళ్లు మూయించారు. పిల్లలు నాణ్యమైన చదువులు చదువుకున్నప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడగలుగుతుందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలుకై ఉక్కు సంకల్పంతో ఉన్నామని సీఎం జగన్‌ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వెనకడుగు వేసే ప్రసక్తేలేదన్నారు. ఇంగ్లీష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్న పెద్దలు వాళ్ల పిల్లలు, మనవళ్లను ఏ మీడియంలో చదవిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే.. తెలుగుపై గౌరవం లేనట్లే అంటూ కొత్త థియరీ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో చదవితే తెలుగుపై గౌరవం లేనట్లు.. ఈ పెద్దల పిల్లలు కార్పొరేటర్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియంలో చదవితే తెలుగు భాషపై గౌరవం ఉన్నట్లా..? అని ప్రశ్నించారుI. ఈ ఏడాది ఆరవ తరగతి వరకు, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కొక్క తరగతికి ఇంగ్లీష్‌ మీడియం వర్తింపజేసి.. నాలుగేళ్లలో పిల్లలు సీబీఎస్‌ బోర్టు పరీక్షలు రాసేలా తీర్చిదిద్దుతామన్నారు.

నాడు నేడు కింద రాష్ట్రంలో 47,665 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 9 రకాల సౌకర్యాలు కల్పిస్తామని జగన్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది 15,715 పాఠశాలల్లో జూలై నెలాఖరు కల్లా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యే ఆగస్టు 3వ తదీన పిల్లలకు స్కూలు బ్యాగు, మూడు జతల యూనిఫాం, కుట్టు కూలి, షూ, బెల్ట్‌ అందిస్తామని చెప్పారు. పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తిని విద్యార్థుల్లో కలిగించేలా చర్యలు చేపడతామన్నారు. జగనన్న గోరు ముద్దలు పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి