iDreamPost

ఎన్నికల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ దందా! ఫ్లైట్ ఛార్జీల కన్నా దారుణం! నిలదీసే దిక్కేది?

  • Published May 10, 2024 | 12:52 PMUpdated May 10, 2024 | 12:52 PM

Elections 2024: ఎన్నికల వేళ ఓటు వేయడం కోసం సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వారికి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ చుక్కలు చూపిస్తున్నాయి. దీనిపై జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

Elections 2024: ఎన్నికల వేళ ఓటు వేయడం కోసం సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వారికి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ చుక్కలు చూపిస్తున్నాయి. దీనిపై జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

  • Published May 10, 2024 | 12:52 PMUpdated May 10, 2024 | 12:52 PM
ఎన్నికల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ దందా! ఫ్లైట్ ఛార్జీల కన్నా దారుణం! నిలదీసే దిక్కేది?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. నేటితో ప్రచారానికి తెర పడనుంది. మరో రెండు రోజుల్లో అనగా మే 13, సోమవారం నాడు ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి ఓటు హక్కు వినియోగం ఆవశ్యకత, అక్కర గురించి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు తెగ ఊదరగొడుతున్నారు. ఈ రోజు మీరు వేసే ఒక్క ఓటు.. ఐదేళ్ల మీ భవిష్యత్తుకు గీటు రాయి ఓ రేంజ్‌లో ప్రచారం చేస్తున్నారు. భారతీయుడిగా ఓటు వేయడం మన బాధ్యత మాత్రమే కాదు.. కర్తవ్యం కూడా అని హితబోధ చేస్తున్నారు. ఎన్ని పనులున్నా సరే.. కచ్చితంగా ఓటు వేయండి అని ప్రచారం చేస్తున్నారు.

ఇక ప్రజలకు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం కోసం కాలేజీలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించారు. అలానే ప్రైవేటు కంపెనీలు కూడా ఓటింగ్‌ నాడు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చూడటం.. ఓటింగ్‌ శాతాన్ని పెంచడం కోసం ఇంత ఖర్చు, ఇన్ని ప్రయత్నాలు చేస్తోన్న ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు.. కొన్ని ముఖ్యమైన సమస్యలను మాత్రం అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోపిడి.

ఉపాధి, ఇతర అవసరాల నిమిత్తం.. సొంత ఊర్లకు దూరంగా ఎక్కడెక్కడో సెటిల్‌ అయిన జనాలు.. ఓటు వేయడం కోసం.. సొంత ఊర్లకు పయనం అవుతున్నారు. రెండో శని, ఆదివారంతో పాటు.. పోలింగ్‌ సందర్భంగా సోమవారం నాడు.. కూడా సెలవు ఉండటంతో.. చాలా మంది జనాలు ఓటు వేయడం కోసం సొంత ఊర్లకు పయనం అవుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ, రైల్వేలో రిజర్వేషన్లు ఫుల్లు అయ్యాయి. దాంతో జనాలు ప్రైవేట్‌ ట్రావేల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇక ఇదే సందుగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఇష్టారీతిగా వసూలు చేస్తూ.. జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. మిగతా రోజుల్లో సొంత ఊర్లకు వెళ్లాలంటే.. 500 రూపాయలు ఖర్చు చేసే చోట.. ఇప్పుడు ఏకంగా 5 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనిపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగం గురించి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు.. మరి ఈ ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడిని ఎందుకు పట్టించుకోవడం లేదు.. సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఎందుకు ప్రభుత్వాలు కానీ.. సంబందిత సంస్థలు కానీ కొరడా ఝుళిపించడం లేదు.. దీనిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఛార్జీలు.. ఫ్లైట్ ఛార్జీల కన్నా దారుణంగా ఉన్నాయి. దీనిపై నిలదీసే దిక్కేది అని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓ కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు ఊరికి వెళ్లి ఓటు వేసి రావాలంటే.. 5-10 వేలు ఖర్చవుతుంది.. ఈ భారాన్ని ఎవరు మోస్తారు.. దీన్ని ఎవరు భర్తీ చేస్తారు.. ఓటు వేయడం ఎంత ముఖ్యమో.. జనాలను దోపిడి నుంచి కాపడటం కూడా అంతే ముఖ్యం కదా.. మరి ఎందుకు ప్రభుత్వాలు, సంస్థలు, అధికారులు.. ఈ సమస్య గురించి తెలిసినా పట్టించుకోవడం లేదు.. చర్యలు తీసుకోవడం లేదు.. జనాల ఓట్లు మాత్రమే మీకు ముఖ్యమా.. వారి సమస్యలు పట్టవా.. ఈ దోపిడికి అడ్డుకట్ట వేయలేరా.. మద్యం, డబ్బు నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న ఎన్నికల సంఘం ఇలాంటి సమస్యలపై ఎందుకు దృష్టి సారించడం లేదు.. కనీసం ఇప్పటికైనా దీని గురించి ఆలోచిస్తే.. భవిష్యత్తులో అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి