Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్లో రైతు సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న వైఎస్సార్సీపీ సర్కార్ అన్నదాతల కోసం మరో పథకం అమలుకు సిద్ధమవుతోంది. ఈ ఖరీఫ్ నుంచి రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు.
క్రాఫ్లోన్లు తీసుకునే ప్రతి రైతులకు సున్నా వడ్దీ పథకం వర్తించనుంది. ఈ పథకంతోపాటు రాబోవు జూలై నెల నుంచి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకు అవసరమైన ఫీడర్ల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించారు. 2004 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా ఆ పథకాన్ని కొనసాగించారు. వైఎస్సార్ తర్వాత రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం.. పలు పథకాల పేర్లు మార్చి వాటిని నిర్వీర్యం చేసినా.. ఉచిత విద్యుత్ పథకం జోలికి మాత్రం రాకపోవడం ఆ పథకం రైతులకు ఏ స్థాయిలో మేలు చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పథకాన్ని మరింత సమర్థవంతగా అమలు చేసేందుకు అధికారంలోకి వచ్చినప్పుటి నుంచీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా పగటి పూటనే వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇచ్చేందుకు అవసరమైన ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేశారు.