iDreamPost

ఆదరించిన ప్రజల్ని అన్యాయం చేస్తారా?

ఆదరించిన ప్రజల్ని అన్యాయం చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో ఆహ్లాదకమైన ప్రశాంత వాతావరణంలో సుందరమైన సముద్ర తీరంతో భిన్నసంస్కృతులతో కాస్మోపాలిటన్ కల్చర్ తో అలరారుతున్న ఏకైక నగరం నగరం విశాఖపట్టణమేనని మాజీ మంత్రి దాడి వీరభధ్ర రావు అన్నారు. ఈరోజు విశాఖ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో విశాఖ పట్టణం ఒక చెన్నై, బెంగుళూరు, పూణే స్థాయిల్లో ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ గా అభివృద్ధి చెందే లక్షణాలు ఈ పట్టణానికి పుష్కలంగా ఉన్నాయి. 1993లో ఆసియా లో రెండు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలను ఎంపిక చెయ్యగా వాటిలో విశాఖ ఒకటని తెలియజేశారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్నాళ్ళకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖకు ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ కార్యనిర్వాహక రాజధాని ని ఏర్పాటు చేయడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలు దానిలో లోటుపాట్లను ఎత్తి చూపి రాజకీయంగా లభి పొందటానికి ప్రయత్నం చేయడం సహజమేనని, గతంలో ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థని ఏర్పాటు చేసినప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇదేం అధికార వికేంధ్రీకరణ అంటూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి సమితులనే కొనసాగించాలని డిమాండ్ చేశాయి. ఆ తరువాత ఆ మండల వ్యవస్థ ఎలా విజయవంతం అయిందో మనమందరం చూశాం. అదేవిధంగా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అధికార వికేంధ్రీకరణ నిర్ణయాన్ని భవిష్యత్ లో ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తారని దాడి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు మొదట్లో ప్రజల్లో కొంత చర్చ జరగడం సహజం అయితే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అసత్య ప్రచారంతో వాతావరణాన్ని విషపూరితం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారని దాడి ఆరోపించారు..

దశాబ్దాలుగా విశాఖతో పాటు ఉత్తరాంధ్రా ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది, కేంద్రప్రభుత్వం అనేక సంవత్సరాలుగా రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్టణాలని అత్యంత వెనుకబడిన జిల్లాలుగా గుర్తించాయని, ఇక్కడ ప్రజల తలసరి ఆదాయం చాలా తక్కువ అని, అలాంటి ఈ ఏడూ జిల్లాలకు అభివృద్ధితో పాటు అధికారన్నీ కూడా సమానంగా వికేంద్రీకరించాలని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రయత్నాన్నిఅభినందిస్తున్నామన్నారు.

బయట ప్రాంతాలనుండి వచ్చిన స్థానికేతరులందరిని ఎంతగానో ఆదరించి, వారిని తమ ఒడిలో పెట్టుకొని వారికి రాజకీయ బిక్ష ప్రసాదించిన ప్రాంతం విశాఖపట్టణమని, బయటనుంచి వచ్చిన వారి పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా వారిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చేసిన సహృదయమైన చరిత్ర ఒక్క విశాఖ వాసులకే దక్కుతుందని ఇలాంటి వాతావరణం రాష్ట్రంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు.

దురదృష్టవశాత్తు ఇక్కడనుండి ఎన్నుకోబడిన కొంతమంది స్థానికేతర మ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలి, విశాఖ కి ఏమి ఇవ్వకూడదు అంటున్న మాటలు చూస్తుంటే అటువంటి వాళ్లని ఆదరించిన మా ప్రజలు పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో అర్థంచేసుకోవచ్చు. అధికారం, పదవులు పొందడమే కానీ తిరిగి ఇక్కడి ప్రజలకు ఏదైనా చేద్దాం అనే ధ్యాసా ఇక్కడనుంచి ఎన్నికైన మాజీ ప్రజాప్రతినిధులకు లేకపోవడంమా ప్రజలు చేసుకున్న దురదృష్టం. విశాఖ పట్టణాన్ని ఎంతగానో ప్రేమించిన యన్టీ రామారావు గారి ఇద్దరు కూతుర్లు కూడా తన తండ్రి గారి అభీష్టానికి వ్యతిరేకంగా అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని ఒక కూతురు జోలెపట్టి తన గాజులు దానం చేస్తే, ఇంకొక కూతురు ఈ ప్రాంతం నుండి యంపీ గా గెలిచి కూడా రాజధానిగా అమరావతి కొనసాగాలని తీర్మానాలు చెయ్యడం చూస్తుంటే మా ఉత్తరాంధ్రులు రామారావు గారి కుటుంబానికి ఏమి అన్యాయం చేశామని ఆయన కూతుర్లు ఇలా వ్యవహరిస్తున్నారో తమకు అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రామారావు గారు ప్రతిపక్షంలో వున్నప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయినా రోజు కూడా ఆ పార్టీకి అత్యధిక ఏమ్మెల్యేలను ఉత్తరాంధ్ర నుంచే గెలిపించి ప్రతిపక్షంలో ఆయన తరుపున పోరాడిన మా మీద, మా ప్రాంతం మీద ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా ఈ ప్రాంతాలకి విరోధులుగా తయరయ్యి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే మిమ్మల్ని గెలిపించడమే మా ప్రాంత ప్రజలు చేసుకున్న పాపమా అని అయన ప్రశ్నించారు. ముప్పై సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎంతగానో ఆదరించి పదవులిచ్చి పెంచి పోషించిన మా ఉత్తరాంధ్రకు దయచేసి అన్యాయం చెయ్యొద్దని దాడి వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు

కేంద్ర ప్రభుత్వంలో హోం శాఖ కార్యదర్శి గా పనిచేసిన శివరామకృష్ణన్ కమిటీ అభివృద్ధి అంటా ఒకే చోట కేంద్రికరించవద్దు అని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని, మలేషియా ప్రభుత్వం గతంలో అమరావతి ప్రాంతం ఎత్తయిన నిర్మాణాలకు పనికిరాదని రిపోర్ట్ ఇచ్చిన దానిని బయటకి రాకుండా తొక్కి పెట్టారని, ఇటీవలే ఈ ప్రానటంలో పర్యటించిన ఐఐటి చెన్నైవారు అమరావతి ప్రాంతం లో భూమిలో 40 మీటర్ల వరకు రాయి తగలలేదు అని ఇలాంటి ప్రాంతంలో బహుళంతస్తుల నిర్మాణాలు చేపట్టాలంటే ఫెయిల్ ఫౌండేషన్, రాఫ్ట్ ఫౌండేషన్ కలిపి వెయ్యాల్సి ఉంటుందని అది భారీ ఖర్చుతో కూడుకున్న విషయమని తమ రిపోర్టులో స్పష్టం చేశారన్నారు. ఇపుడంత ఖర్చు చేసే పరిస్థితుల్లో ఉందా అని ఆయన ప్రశ్నించారు. అటువంటి అమరావతి ప్రాంతాన్నే రాజధాని గా కొనసాగించాలంటూ ఇన్ని జిల్లాల మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రయోజనాలని ఫణంగా పెట్టి చంద్రబాబు అమరావతి అనుకూల ఉద్యమాన్ని నడపడం చూస్తుంటే ఆయనకు రాజధానిలో బినామీ ఆస్తులు భారీగా ఉన్నట్టు తనకి అనుమామానంగా ఉందని దాడి వీరభద్రరావు సందేహం వ్యక్తం చేశారు

విశాఖపట్టణం అభివృద్ధికి చెంద్రబాబే ప్రధాన అడ్డంకి అని దాడి ధ్వజమెత్తారు. విశాఖకు రావాల్సిన సాఫ్ట్ వేర్ కంపెనీలను, ఆర్బీఐ కార్యాలయాన్ని, ఎస్బిఐ కార్యాలయాన్ని, సినిమా స్టూడియోలని అనేక భారీ పరిశ్రమలని చంద్రబాబు అమరావతి కి తరలించాలని చూడడంతోనే అమరావతిలో పెట్టుబడులు పెట్టడం ఇష్టంలేక అవి రాష్ట్రానికి రాకుండా వెనక్కి వెళ్ళాయని దాడి ఆరోపించారు. ఇకనైనా చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలు మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నాలను మానుకొని అధికార వికేంధ్రీకరణకు మద్దతిచ్చి అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పాటుపడాలని దాడి హితవు పలికారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి