iDreamPost

కరోనా ఉగ్రరూపం- ఒకేరోజు 195 మరణాలు

కరోనా ఉగ్రరూపం- ఒకేరోజు 195 మరణాలు

ఒక్కరోజులో 3900 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఒక్కరోజులో 3900 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,433కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 1568 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 12,727 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 32,138 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 9 వేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం వల్ల దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. కొత్తగా 1567 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 35 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో 14541 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 583 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 2465 మంది వైరస్ బారినుండి పూర్తిగా కోలుకున్నారు.

పశ్చిమబెంగాల్ లో కరోనా మృతులు ఒక్కసారిగా పెరిగాయి. ఒక్కరోజులోనే 98 మంది కరోనా కారణంగా మృతిచెందారు. దాంతోపాటుగా 296 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కి చేరింది. కరోనా కారణంగా 133 మంది మృతిచెందారు. గుజరాత్‌లో కూడా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటివరకు 5804 కేసులు నమోదవ్వగా, 319 మంది మృతిచెందారు. 1042 మంది డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజులోనే 376 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో 1082 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 585 మంది డిశ్చార్జ్ అయ్యారు.నిన్న కొత్తగా మూడు కేసులు నిర్దారణ అయ్యాయి. 29 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1650 మందికి కరోనా సోకగా 36 మంది మృత్యువాత పడ్డారు. 524 మంది వ్యాధి నుండి కోలుకున్నారు. నిన్న 67 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 3,646,225 మందికి కోవిడ్ 19 సోకగా 252,408 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 252,408 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,212,900 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 69,921 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి