iDreamPost

వడివడిగా అడుగులు.. లక్ష్యం వైపు సీఎం జగన్‌..

వడివడిగా అడుగులు.. లక్ష్యం వైపు సీఎం జగన్‌..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రలను, అసత్య ప్రచారాలను ఓ వైపు పటాపంచలు చేస్తూనే.. మరో వైపు ప్రాజెక్టు పనులు ఆగకుండా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లకు వెళ్లిన కూలీలను ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా మళ్లీ రప్పించి పనులు ప్రారంభింపజేశారు. వరదల సమయంఓలనూ పనులు సాగేలా దిశానిర్ధేశం చేశారు. అందుకే హెడ్‌వర్స్క్‌లోని స్పిల్‌వే పనులు 52 మీటర్ల ఎత్తు మేర జరిగాయి. ప్రస్తుతం గేట్లు బిగించేందుకు అవసరమైన పనులు జరుగుతున్నాయి. స్పిల్‌ ఛానెల్‌లో కాంక్రీటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జగన్‌ సీఎం అయ్యాక స్పీల్‌ వే, స్పిల్‌ ఛానెల్‌లో 3,228 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు జరగడం ప్రాజెక్టు పూర్తిపై సీఎం జగన్‌ తన చిత్తశుద్దిని చాటుకున్నారు. ఇక కరోనా సమయంలోనే 2,308 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు జరగడం ప్రాజెక్టు నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది.

మాటలు కాదు.. చేతల్లో..

తాను మాటలు తక్కువ.. పని ఎక్కువగా చేసే సీఎంనని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతి చోటా నిరూపించుకుంటున్నారు. సంక్షేమ పథకమైనా, అభివృద్ధి కార్యక్రమమైనా.. చివరకు పోలవరం ప్రాజెక్టు అయినా.. ప్రచారానికి దూరంగా ఉంటూ.. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 18 నెలల వైసీపీ ప్రభుత్వ హయంలో సీఎం వైఎస్‌ జగన్‌ కేవలం మూడు సార్లే ప్రాజెక్టును సందర్శించారు. కానీ పని మాత్రం శరవేగంగా సాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. గత పాలకులు పోలవరం సోమవారం అనే రైమింగ్‌ పదాలతో ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అనేలా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వ్యవహరించారని జరిగిన పనులతో తేటతెల్లమైంది. దిశానిర్ధేశం లేకుండా చేసిన పనుల వల్ల దేవీపట్నం ముంపునకు గురైంది. ఈ లోపాలను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాజెక్టు పనులపై పక్కా కార్యాచరణ సిద్ధం చేశారు. అధికారులు, నిపుణులతో చర్చించి.. వరదల సమయంలోనూ పనులు సాగేలా చూశారు.

లెక్కలు పక్కాగా..

పోలవరం నిర్మాణ ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉన్నా.. కేంద్రం నిధులు విడుదల చేయడం వరకూ ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తోంది. గత ప్రభుత్వ హాయంలో కాంట్రాక్టర్‌కు బిల్లులు పెడింగ్‌లో ఉన్నాయి, కూలీ ఇవ్వకపోవడంతో కార్మికులు వెళ్లిపోతున్నారు.. అనే వార్తలు నిత్యం దినపత్రికల్లో కనిపించేవి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఎక్కడా అలాంటి వార్తలు వినిపించక/ కనిపించకపోవడానికి జీవనాడి అయిన పోలవరంపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన శ్రద్ధనే చెప్పవచ్చు. ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చును ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపుతుండడంతో.. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తోంది. వరుస విరామంలో నిధులను రీయంబర్స్‌ చేస్తోంది.

ఖరీఫ్‌కు నీళ్లు..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు గడువు పెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ దిశగా ఈ రోజు అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అనుగుణంగా అటు ఉత్తరాంధ్రలోనూ, ఇటు రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలోనూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతుండడంతో సీఎం వైఎస్‌ జగన్‌ మరింత శ్రద్ధ పెట్టారు. పోలవరం ప్రాజెక్టు ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందించడంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకుంటున్నారు. వచ్చే మే నెల నాటికి స్పిల్‌ వే, స్పిల్‌ ఛానెల్‌ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్‌ మరోమారు అధికారులకు గుర్తు చేశారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఎగువ కాఫర్‌ డాంను, జూలై నాటికి దిగువ కాఫర్‌ డ్యాంను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిసెంబర్‌ నాటికి ఎర్త్‌కంరాక్‌ ఫిల్‌ డ్యాంను పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు.

 

మూడేళ్లలోనే పూర్తి..

2022 ఖరీఫ్‌ పంటకు పోలవరం నుంచి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ పని చేస్తున్నారు. అంటే జూన్‌ నెలకు పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టనున్నారు. దశల వారీగా ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేసే ప్రక్రియలో భాగంగా.. మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయనున్నారు. ఆ ఎత్తుకు 17,760 కుటుంబాలకు ముంపునకు గురికానున్నాయి. జూన్‌ లోపు ముంపునకు గురయ్యే వారికి పునరావాసం కల్పించాలని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగితే.. వైసీపీ అధికారం చేపట్టిన మూడేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి