iDreamPost

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్! రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ..

24 Hors Free Current For Farmers: తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.

24 Hors Free Current For Farmers: తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్! రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ..

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పాలసీని రాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో విద్యుత్ శాఖపై సుదీర్ఘంగా సమీక్షించారు. రైతులకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తును అందించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్లు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి రాష్ట్రంలో సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.

విద్యుత్ శాఖ మీద సచివాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుధీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ అధికారులు మాత్రమే కాకుండా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు కూడా పాల్గొన్నారు. ఈ సమీక్షలో విద్యుత్ అధికారులకు సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు హమీ ఇచ్చిన విధంగా కచ్చితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ను అందించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యుత్తు వినియోగం, 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 200 యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై పూర్తి వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు విద్యుత్ కంపెనీలు, విద్యుత్ నియంత్రణ మండలి మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధరలు వంటి వాటిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. ఆ అధ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కువ ధర చెల్లించే విధంగా జరిగిన ఒప్పందాలకు కారణాలేంటో నివేదించాలన్నారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందో, ఆ కంపెనీల నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు సరైన విద్యుత్ పాలసీని రూపొందించక ఇబ్బందులు, సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్తు విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఏ రాష్ట్రంలో మెరుగైన విధానం ఉందో అధ్యయనం చేసి, నివేదించాలని సీఎం ఆదేశించారు. అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన విద్యుత్తు విధానాన్ని తెలంగాణలో అమలుచేయాలన్నారు. అందుకోసం నిపుణులతో చర్చించి, అసెంబ్లీలోనూ అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి, సరికొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామంటూ సీఎం వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. 6 గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం కింద ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్టంగా, ముందస్తు చర్యలను చేపట్టాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి