iDreamPost

మెట్రో, ఫార్మా సిటీ నిర్ణయాలపై CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

CM Revanth On Hyderabad Metro Rail: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రోరైలు విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth On Hyderabad Metro Rail: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రోరైలు విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మెట్రో, ఫార్మా సిటీ నిర్ణయాలపై CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

సాధారణంగా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలును నిలిపివేయడం, వాటిని రద్దు చేయడం కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఏర్పడిన రేవంత్ సర్కారు కూడా.. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మెట్రో రైలు విస్తరణ, ఫార్మా సిటీ నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందనే అనుమానాలు చాలా మందే వ్యక్త పరిచారు. ఆ అనుమానాలు, ఊహాగానాలపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రజా ప్రయోజనమే తమ సర్కారు ప్రధాన లక్ష్యమంటూ స్పష్టం చేశారు.

కొత్త ఏడాది సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు, ఫార్మా సిటీ నిర్ణయాలపై తమ ప్రభుత్వం ఏ విధంగా స్పందిచబోతోంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. మెట్రో రైలు, ఫార్మా సిటీ నిర్ణయాలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడం లేదంటూ చెప్పుకొచ్చారు. “ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మొత్తం 6 సెక్టార్లలో మెట్రో రైలును విస్తరిస్తున్నాం. ఎయిర్ పోర్టుకు దూరాన్ని తగ్గిస్తాం. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ కు మెట్రో విస్తరిస్తాం. మియాపూర్ నుంచి కావాలి అనుకుంటే రామచంద్రాపురం వరకు మెట్రో విస్తరిస్తాం. హైటెక్ సిటీ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకూ పొడిగిస్తాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ ప్రతిపాదించిన వాటికన్నా తక్కువ ఖర్చుతోనే పూర్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 15 నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేస్తాం. సంక్రాంతిలోపే కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్ లను నియమిస్తాం. అన్ని నిర్ణయాల అమలుకు 100 రోజులు పెట్టుకుని పని చేస్తాం. మా సర్కారులో ప్రభుత్వం మీద భారం ఎలాంటి నిర్ణయాలు ఉండవు” అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

స్కిల్ యూనివర్సిటీలకు సంబంధించి.. ఇంటర్నేషనల్ ప్రమాణాలు కలిగిన కంపెనీలు, పారిశ్రామిక వేత్తల ద్వారా శిక్షణ ఇప్పిస్తామన్నారు. అంతేకాకుండా ఈ స్కిల్ యూనివర్సిటీలో పొందే డిగ్రీలకు.. సాధారణంగా తీసుకునే డిగ్రీలకు ఉండే అర్హతలు అన్నీ ఉంటాయన్నారు. ప్రత్యేక క్లస్టర్స్ ఏర్పాటు గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మా సిటీ, ఔటర్ రింగ్ రోడ్డ్, రీజినల్ రింగ్ రోడ్డుల మధ్య ఈ స్పెషల్ క్లస్టర్స్ నిర్మాణం ఉంటుందని చెప్పారు. జీరో పొల్యూషన్ తో ఈ ప్రత్యేక క్లస్టర్స్ నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. కర్మాగారాలు, పరిశ్రమల్లో పనిచేసే వారికోసం ఈ క్లస్టర్స్ దగ్గర ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామంటూ వ్యాఖ్యానించారు. కార్మికులు హైదరాబాద్ వరకు వచ్చే పని లేకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తామన్నారు. మరి.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి