Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు బుధవారం హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, మండలి రద్దు వ్యవహారం తదితర అంశాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎం అధికారిక పర్యటన ఖారారైంది. ఉదయం మంత్రివర్గ భేటీ అనంతరం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 – 6 గంటల మధ్యలో ప్రధాని, హోం మంత్రితో సమావేశం కానున్నారు.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. రెవెన్యూ లోటు ప్రస్తావనే లేదు. ఈ అంశాలను మోదీ దృష్టికి సీఎం తీసుకెళ్లే అవకాశం ఉంది. వీటితోపాటు ఇటీవల కేంద్రం వద్దకు చేరిన మండలి రద్దు బిల్లుపై అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. మండలి రద్దు బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడితేనే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.