iDreamPost

యూనివర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్‌!

యూనివర్సిటీలు,  ట్రిపుల్‌ ఐటీల్లో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్‌!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజును విద్యా, వైద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. విద్యా, వైద్య రంగంలో అనేక  సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యార్థులకు అందించే నిజమైన ఆస్తి.. చదువే అని బలంగా నమ్మిన వ్యక్తి సీఎం జగన్. అందుకే విద్యా రంగంపై భారీగా నిధులు కేటాయించారు. తరచూ విద్యాశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా యూనివర్సీటీలు, ట్రిపుల్ ఐటీల్లోలో అధ్యాపకుల నియామకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గురువారం తాడేపల్లిలోని సీఎం  క్యాంపు కార్యాలయంలో విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీలలో అధ్యాపకుల నియామకాలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 3295 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. దీంతో నవంబరు 15 నాటికి ఈ రిక్రూట్ మెంట్ నియామక ప్రక్రియను పూర్తికానున్నాయి. ఏపీపీఎస్సీ  ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్ధాయి రెగ్యులర్‌ సిబ్బంది నియామకానికి ఆమోదం సీఎం ఆమోదం తెలిపారు.

యూనివర్సిటీల్లో 2635 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుతో పాటు, ట్రిపుల్‌ ఐటీల్లో 660 పోస్టుల భర్తీకానున్నాయి. ఇక ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. “రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో మొత్తం ఖాళీలు భర్తీ చేయాలి. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో 51వేల పోస్టుల భర్తీ చేశాం. అదే విధంగా విశ్వవిద్యాలయాల్లో కూడా పూర్తి స్ధాయిలో ఖాళీలను భర్తీ  చేయాలి. యూనివర్సిటీలలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే… పూర్తి స్ధాయిలో రెగ్యులర్‌ పోస్టుల భర్తీ చేయాలి” అని సీఎం తెలిపారు. అదే విధంగా ఇప్పటికే కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్‌ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించగా.. ఇంటర్వ్యూ టైంలో ఈ వెయిటేజ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీపై షెడ్యూల్, పరీక్షా విధానంపై సీఎంకు వివరాలను అధికారులు అందించారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి