iDreamPost

కేంద్రం కొత్త పథకం.. గొర్రెల పెంపకం కోసం రూ.కోటి రుణం.. 50 లక్షల వరకు రాయితీ

  • Published Oct 02, 2023 | 4:20 PMUpdated Oct 02, 2023 | 4:20 PM
  • Published Oct 02, 2023 | 4:20 PMUpdated Oct 02, 2023 | 4:20 PM
కేంద్రం కొత్త పథకం.. గొర్రెల పెంపకం కోసం రూ.కోటి రుణం.. 50 లక్షల వరకు రాయితీ

వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను కూడా ప్రోత్సాహిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గొర్రెల పెంపకానికి అధిక ప్రధాన్యత ఇస్తోన్న సంగతి తెలిసిందే. మాంసం ఉత్పత్తి పెంచడమే కాకుండా తద్వారా ఉపాధి కోసం ఎదురుచూసే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు గొర్రెల పెంపకాన్ని ప్రోత్సాహిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కేవలం యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సామాజిక వర్గంతో సంబంధం లేకుండా.. గొర్లు, మేకల పెంపకానికి ఆసక్తి ఉన్న అన్ని సామాజిక వర్గాల వారి కోసం కేంద్ర పశు సంవర్ధక (నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రూ. కోటి వరకు రుణం మంజూరు చేస్తోంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ. 50 లక్షల వరకు రాయితీ కల్పిస్తోంది.

వ్యక్తిగతంగా, సామూహికంగా గానీ లేదంటే సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాల వారు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులు అవుతారు. కేంద్ర ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో అన్ని సామాజిక వర్గాల వారు ఈ రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది.

ఏమేం కావాలంటే..

రూ. కోటి విలువైన యూనిట్‌లో 500 ఆడ మేకలు, గొర్రెలు, 25 పోతుల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి పెంపకం కోసం ఎకరం నుంచి 5 ఎకరాల సొంత లేదా లీజు భూమి కలిగి ఉండాలి. దాంట్లో షెడ్ నిర్మించే తీరు, గ్రాసం పెంచే చోటు, సొంత అడ్రస్, స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు కావాలి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్న ఆసక్తిదారులు www.nlm.udyamimitra.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎలా సెలక్ట్‌ చేస్తారంటే..

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇటీవలే ప్రారంభమైంది. పశు సంవర్ధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఈ స్కీం కింద ఎంపికైన వ్యక్తులు, సంఘాలకు కేంద్రం యూనిట్ విలువలో 50 శాతం రాయితీగా అనగా సుమారు 50 లక్షల రూపాయల వరకు విడుదల చేస్తుంది. మరో 40 శాతం రుణం కోసం బ్యాంకులకు సిఫార్సు చేస్తుంది. లబ్ధిదారుడు తన వాటా కింద కేవలం 10 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. తీసుకునే గొర్రెల్ని బట్టి కూడా యూనిట్ విలువ నిర్దేశించారు. 105 మేకలు, గొర్రెలు, 210, 315, 420 మేకలు/గొర్రెలతో కూడా యూనిట్లు ఉన్నాయి. వాటి సంఖ్య ఆధారంగా యూనిట్ విలువ నిర్ణయించి లబ్ధిదారులకు 50 శాతం రాయితీని.. రెండు విడతలుగా విడుదల చేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి