Idream media
Idream media
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను సీబీఐకి ఇస్తూ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను… సీబీఐకి ఇప్పగించాలని ఆయన కుమార్తె సునీత, సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరితోపాటు టీడీపీ నేతలు బి.టెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు పలుమార్లు విచారించింది. సిట్ విచారణ బాగా జరుగుతోందని, సీబీఐ విచారణ అవసరంలేదని ప్రభుత్వం వాదనలు వినిపించింది.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. బి.టెక్ రవి, ఆదినారాయణ రెడ్డిల పిటిషన్లు కొట్టేసిన ధర్మాసనం.. వివేకానంద సతీమణి, కుమార్తె పిటిషన్ల మేరకు హత్యకేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఏప్రిల్లో ఎన్నికల సమయంలో హత్యకు గురయ్యారు. పులివెందులలోని తన స్వగృహంలోనే ఆయన్ను దుండగులు కిరాతకంగా నరికి చంపారు. అప్పట్లో ఈ హత్యపై టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.