iDreamPost

కరోనా టీకా కోసం న్యాయవాదుల పిల్‌.. టైటానిక్‌ సినిమాను గుర్తు చేసిన హైకోర్టు సీజే

కరోనా టీకా కోసం న్యాయవాదుల పిల్‌.. టైటానిక్‌ సినిమాను గుర్తు చేసిన హైకోర్టు సీజే

ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను, కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ, వాటిలో మార్పులు చేయాలని లేదా రద్దు చేయాలని న్యాయస్థానాల్లో చీటికి మాటికి కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) దాఖలు చేస్తుంటారు. ఇలాంటి వారు అన్ని రాష్ట్రాలలోనూ ఉంటూరు. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రెండు నెలల ముందు విపరీతంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. పిటిషనర్లు కోరిని విధంగా ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే ఇలా చీటికి మాటికి వ్యాజ్యాలు దాఖలు చేసే వారికి బాంబే హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. దేనిపై పిటిషన్లు వేయాలో.. వేటిపై వేయకూడదో, ఎలాంటి సమయంలో కోర్టు తలుపుల తట్టాలో విపులీకరించింది. ఇలాంటి క్లారిటీ తీసుకున్న పిటిషనర్లు న్యాయవాదులు కావడం విశేషం.

పిటిషన్‌ ఏమిటి..?

న్యాయమూర్తులు, న్యాయవాదులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి కరోనా టీకా పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలని కొంత మంది న్యాయవాదులు బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కూడా కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, న్యాయమూర్తులు నిర్విరామంగా పని చేశారని న్యాయవాదులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన న్యాయమూర్తులను, కోర్టు సిబ్బందిని, తమను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి టీకా ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు.

క్లాస్‌ పీకిన ప్రధాన న్యాయమూర్తి..

న్యాయవాదుల వాదనను ఆశాంతం ఆలకించిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపంకర్‌ దత్తా వారికి క్లాస్‌ తీసుకున్నారు. ప్రైవేటు సంస్థల ఉద్యోగుల తరఫున కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే సరిపోయేది.. ప్రతి ఒక్కరూ ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌ అయిపోయేవారు కదా..? అంటూ చురకలు అంటించారు. మీరు కోరుతున్నది స్వార్థపూరితమని సీజీ దీపంకర్‌ దత్తా న్యాయవాదులకు తలంటారు. ‘‘కొన్ని విషయాలను కార్యనిర్వాహక వ్యవస్థ విజ్ఞతకే వదిలేయాలి. ప్రభుత్వ విధానంలో తప్పుంటే చెప్పండి. ఓ ప్రభుత్వ విధానం ఇష్టానుసారంగా ఉంటే కోర్టులు కల్పించుకుంటాయి’’ అని సీజే స్పష్టత ఇచ్చారు.

Also Read : విజృంభిస్తున్న కరోనా.. మళ్లీ లాక్‌డౌన్‌

టైటానిక్‌ సినిమా గుర్తు చేసి.. శాంతపరిచి..

ప్రజాప్రయోజన వాజ్యాలు ఎలాంటి సమయాల్లో దాఖలు చేయాలో వివరించిన సీజే.. టీకా కోసం న్యాయవాదులు పడిన తాపత్రయాన్ని గుర్తించి.. వారిని శాంతపరిచే ప్రయత్నం చేశారు. అందు కోసం టైటానిక్‌ సినిమాలోని ఓ సీన్‌ను వివరించారు. ‘‘టైటానిక్‌ సినిమాలో షిప్‌ మునిగిపోతుంటే.. అందులోని వారందరినీ దించిన తర్వాతనే తాను దిగుతానని కెప్టెన్‌ అంటారు. అలాగే ప్రజలందరికీ టీకా అందిన తర్వాతనే న్యాయమూర్తులకు ఇవ్వాలి. ఇక్కడ నేనే కెప్టెన్‌’’ అంటూ సీజే దీపంకర్‌ దత్తా విచారణను సరికొత్తగా ముగించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి