iDreamPost

ఆ రెండు పార్టీల మధ్య పొత్తు..? సీట్ల పంపకం చేసేసిన బీజేపీ సారథి..

ఆ రెండు పార్టీల మధ్య పొత్తు..? సీట్ల పంపకం చేసేసిన బీజేపీ సారథి..

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న తెలంగాణ బీజేపీ రథసారధి బండి సంజయ్.. ఇప్పుడు కొత్త వాదనను తెరమీదకు తీసుకొస్తున్నారు. తాను చేస్తున్న పాదయాత్రతో వచ్చే మైలేజీని మరింత పెంచుకోవటానికి వీలుగా బండి ప్రయత్నాలు చేస్తున్నారు. శని.. ఆదివారాల్లో ప్రగతిభవన్ లో కూర్చొని సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ ఉదంతంపై తనదైన శైలిలో కొత్త తరహా వాదనను వినిపిస్తున్నారు.

ఎవరెన్ని చెప్పినా.. కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించటం ద్వారా భవిష్యత్తులో మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే పీకే ఆలోచనగా చెబుతారు. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున శక్తులు పనిచేస్తాయన్న విషయం పీకేకు తెలియంది కాదు. అందుకే తన గేమ్ ప్లాన్ ను పక్కాగా సెట్ చేసుకుంటారు. ఇందులో భాగంగా ఇప్పుడు కాకున్నా ఎప్పటికైనా సరే.. కాంగ్రెస్ తో కలిసి పని చేయాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ కు బాగా అర్థమయ్యేలా చెప్పినట్లుగా చెబుతున్నారు.

అలా అని తనకున్న పరిమితుల్ని దాటేసి.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటానికి కేసీఆర్ ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. భవిష్యత్తు సంగతి.. అప్పటి పరిణామాల నేపథ్యంలో అప్పుడు ఆలోచిద్దామనే మాట గులాబీ బాస్ నోటినుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ.. రెండు కొప్పుల్ని కలిపేసిన చందంగా బండి సంజయ్ కొత్త ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చారు.

ఒకవైపు టీఆర్ఎస్ -కాంగ్రెస్ మధ్య టైఅప్ అంశం ప్రాథమికంగా ఉన్న వేళలోనే.. అదేదో జరిగిపోయిందన్న భావన కలిగించేలా బండి సంజయ్ తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. తాజాగా పాదయాత్ర చేస్తున్న ఆయన.. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం చేయలేక.. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో జత కట్టబోతున్నట్లుగా ఆయన వెల్లడించటం విశేషం. నిజానికి ఇలాంటిదేమైనా ఉంటే దాన్ని ఆ రెండు పార్టీలు ప్రకటిస్తాయి. లేదంటే తమకు అనుకూలంగా లీకులు ఇస్తాయి. అవన్నీ లేకుండానే బండి తానే ఒక అడుగు ముందుకు వేసి.. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ – కాంగ్రెస్ లు కలిసి పోటీచేస్తాయని చెబుతున్నారు.

అక్కడితో ఆగని ఆయన మరింత ముందుకు వెళుతూ.. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ 31 అసెంబ్లీ స్థానాలు.. నాలుగు ఎంపీ సీట్లు ఇస్తుందంటూ పొత్తుల లెక్కల్ని వివరించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్ కు ఓటేస్తే అది టీఆర్ఎస్ కు వేసినట్లేనని చెబుతూ.. కాంగ్రెస్ లో గెలిచేటోడు అమ్ముడుబోతాడు.. ఓడిపోతే పార్టీనే అమ్మేస్తాడంటూ విరుచుకుపడ్డారు బండి సంజయ్. బీజేపీతో కలిసి టీఆర్ఎస్ ఏనాడూ పోటీ చేయలేదని.. పొత్తు పెట్టుకోలేదని బండి గుర్తుచేయటం గమనార్హం.

హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 సీట్లు.. ఉప ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన తర్వాత కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. తమ పార్టీ చేస్తున్న నిరసనలు.. ఆందోళనలతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ దాటి ధర్నా చౌక్ కు వచ్చారన్నారు. బండి సంజయ్ చెప్పినట్లే అధికార టీఆర్ఎస్.. కాంగ్రెస్ కు మధ్య పొత్తు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొత్తు ఊహాగానాలు వాస్తవరూపం దాల్చుతాయా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి