iDreamPost

బీసీసీఐ ఆఫర్​ను తిరస్కరించిన నెహ్రా! అహంకారంతో కాదు.. ఆలోచించే చేశాడు!

  • Author singhj Updated - 06:22 PM, Wed - 29 November 23

వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు టీమిండియా హెడ్ కోచ్ పదవిని బీసీసీఐ ఆఫర్ చేసిందట. అయితే దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించాడట. దీంతో నెహ్రా అహంకారంతో ఇలా చేశాడని అంటున్నారు. కానీ సీనియర్ పేసర్ తీరును చూస్తే ఆయన ఆలోచనతోనే ఇలా వ్యవహరించాడని అర్థమవుతోంది.

వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు టీమిండియా హెడ్ కోచ్ పదవిని బీసీసీఐ ఆఫర్ చేసిందట. అయితే దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించాడట. దీంతో నెహ్రా అహంకారంతో ఇలా చేశాడని అంటున్నారు. కానీ సీనియర్ పేసర్ తీరును చూస్తే ఆయన ఆలోచనతోనే ఇలా వ్యవహరించాడని అర్థమవుతోంది.

  • Author singhj Updated - 06:22 PM, Wed - 29 November 23
బీసీసీఐ ఆఫర్​ను తిరస్కరించిన నెహ్రా! అహంకారంతో కాదు.. ఆలోచించే చేశాడు!

టీమిండియా హెడ్ కోచ్​ రాహుల్ ద్రవిడ్ ఫ్యూచర్​పై గత కొన్ని రోజులుగా అనిశ్చితి నెలకొంది. కోచ్​గా పదవీ కాలం పూర్తవ్వడంతో ఆయన విషయంలో భారత క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ద్రవిడ్​ కాంట్రాక్ట్​ను కొనసాగిస్తామని ఆఫర్ ఇచ్చినా ఆయన దీనికి నో చెప్పాడంటూ వార్తలు వచ్చాయి. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ) చీఫ్​గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్​కు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పేందుకు బోర్డు సిద్ధమైందని రూమర్స్ వినిపించాయి.

ప్రస్తుతం ఆసీస్​తో టీ20 సిరీస్​లో తాత్కాలిక కోచ్​గా ఉన్న లక్ష్మణ్​కు పట్టం కట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని గాసిప్స్ వచ్చాయి. కానీ ఇవేవీ నిజం కాలేదు. టీమిండియా హెడ్​ కోచ్​ పదవిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. కోచ్​గా కొనసాగేందుకు ద్రవిడ్ ఓకే చెప్పాడు. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. రాహుల్ ద్రవిడ్​తో పాటు ఇప్పటికే ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ పదవీ కాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు బోర్డు ఎక్స్​టెన్షన్ ఇచ్చింది. అయితే వీరందరూ ఎప్పటివరకు తమ పదవిలో కంటిన్యూ అవుతారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

మరో ఏడు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో కోచింగ్ స్టాఫ్​ను మార్చడం సరికాదనే ఉద్దేశంతో కిందా మీద పడి ద్రవిడ్​ను ఒప్పించిందట బీసీసీఐ. ఆయన ఓకే చెప్పడంతో సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని కూడా పొడిగించిందని తెలుస్తోంది. అయితే ద్రవిడ్ ప్లేసులో కోచింగ్ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఒక మాజీ టీమిండియా పేసర్​ను బీసీసీఐ కోరిందట. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. ఆశిష్ నెహ్రా అని వినికిడి. హెడ్​ కోచ్​గా బాధ్యతలు స్వీకరించమని బోర్డు ఆయన్ను రిక్వెస్ట్ చేసిందట. కానీ దీనికి నెహ్రా సున్నితంగా నో చెప్పాడట.

కోచింగ్ బాధ్యతలు అప్పజెబుతామని బీసీసీఐ కోరితే ఆశిష్ నెహ్రా తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. బోర్డు ఆఫర్​ను వద్దనడం కరెక్ట్ కాదని.. ఇది ఆయన అహంకారానికి నిదర్శనమని కొన్ని కామెంట్స్ వినిపించాయి. అయితే నెహ్రా అహంకారంతో కాదు.. ఆలోచనతోనే ఇలా వ్యవహరించాడని నెట్టింట కొందరు అభిమానులు అంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో గుజరాత్​కు కోచింగ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడతను. ఏడాదిలో 45 నుంచి 60 రోజులు మాత్రమే కోచింగ్ విధులు. నెలన్నర కష్టపడితే చాలు.. భారీ మొత్తంలో డబ్బు అందుతోంది.

ఇప్పటికే టీమ్​కు ఒకసారి టైటిల్ అందించడం, మరోమారు ఫైనల్​కు తీసుకెళ్లడంతో గుజరాత్ మేనేజ్​మెంట్ నెహ్రాను బాగా చూసుకుంటోందట. మరోవైపు కామెంట్రీ కూడా చేస్తూ రెండుచేతులా సంపాదిస్తున్నాడు. ఖాళీ టైమ్ దొరికినప్పుడు కుటుంబంతో గడుపుతున్నాడు నెహ్రా. ఇలాంటి తరుణంలో ఫుల్ టైమ్ కోచింగ్ ఎందుకని వద్దనుకున్నాడట వెటరన్ పేసర్. బిజీ షెడ్యూల్స్, ఫ్యామిలీతో గడిపే ఛాన్స్ ఉండదు. తీవ్ర ఒత్తిడి ఉంటుంది కాబట్టి బోర్డు ఆఫర్​కు ఆయన నో చెప్పాడట. ఫ్యూచర్​లో మళ్లీ ఆఫర్ వస్తే ఆలోచిద్దామనే ఉద్దేశంతో అలా చేశాడని అంటున్నారు. మరి.. బీసీసీఐ ఆఫర్​కు నెహ్రా నో చెప్పాడంటూ వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: RCBలోకి వరల్డ్‌ కప్‌ హీరో రచిన్‌ రవీంద్ర? ఆ సెంటిమెంట్‌తోనే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి