iDreamPost

World Cup: భారత్‌-పాక్‌ మ్యాచ్‌! క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

  • Published Oct 08, 2023 | 10:39 AMUpdated Oct 08, 2023 | 10:39 AM
  • Published Oct 08, 2023 | 10:39 AMUpdated Oct 08, 2023 | 10:39 AM
World Cup: భారత్‌-పాక్‌ మ్యాచ్‌! క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

క్రికెట్‌ అభిమానులకు పండుగలాంటి వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రారంభమైపోయింది. అయితే.. ఫ్యాన్స్‌ అంతా ఎదురుచూస్తున్న అసలు సిసలైన మ్యాచ్.. అదేనండీ ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఈ రోజు జరగనుంది. కాగా, ఈ మ్యాచ్‌ కంటే కూడా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ ఓ గుడ్‌న్యూస్‌ను క్రికెట్‌ అభిమానులకు అందించింది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం మరో 14 వేల టికెట్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ నెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఇండియా-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన గంటలోనే అమ్ముడుపోయాయి. చాలా మంది ఫ్యాన్స్‌కు కనీసం టికెట్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా దక్కలేదు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల అమ్మకం పెద్ద స్కామ్‌లా ఉందంటూ బీసీసీఐపై మండిపడ్డారు. దీంతో.. అభిమానుల కోపానికి కాస్త దిగొచ్చిన బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకొని, మరో 14 వేల టికెట్లు రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక అతిపెద్ద ఈ క్రికెట్‌ స్టేడియంలో ఏకంగా ఒక లక్షా 32 వేల మంది ప్రేక్షకులు కూర్చొనే వెసులుబాటు ఉంది. ఇంత పెద్ద స్టేడియం అయినా కూడా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కావడంతో స్టేడియం పూర్తిగా నిండిపోతుందని బీసీసీఐ భావిస్తోంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే.. అదనంగా విడుదల చేసిన ఈ 14 వేల టిక్కట్లు ఈ రోజు(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి. ఇదే వేదికలో వరల్డ్ కప్ ఓపెనింగ్ గేమ్ జరిగిన విషయం తెలిసిందే. న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తలపడిన ఈ మ్యాచులో డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర శతకాలతో చెలరేగడంతో కివీస్ ఘనవిజయం సాధించింది. నవంబరు 19న వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. మరి భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం అదనపు టిక్కెట్టు విడుదల చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బలహీనతే బలం కానుందా? అయ్యర్​తో ద్రవిడ్ ఏం చేయబోతున్నాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి