iDreamPost

ఆదిపురుష్‌ను బ్యాన్‌ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన ఆల్‌ ఇండియా సిని వర్కర్స్‌!

  • Published Jun 20, 2023 | 3:02 PMUpdated Jun 20, 2023 | 3:02 PM
  • Published Jun 20, 2023 | 3:02 PMUpdated Jun 20, 2023 | 3:02 PM
ఆదిపురుష్‌ను బ్యాన్‌ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన ఆల్‌ ఇండియా సిని వర్కర్స్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రాముడి పాత్రలో, బాలీవుడ్‌ భామ కృతి సనన్‌ జానకి పాత్రలో.. ఓం రౌత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్‌ సినిమా.. జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌, టీజర్‌ ఆఖరికి సినిమా విడుదల సమయంలో కూడా భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది. ఓం రౌత్‌ మోడ్రన్‌ రామాయణం పేరిట.. వాల్మికీ రాసిన అసలు రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించారని ప్రేక్షకులు మండి పడుతున్నారు. హిందువులు పవిత్రంగా భావించే రామాయణం, అందులోని పాత్రలను.. ఓంరౌత్‌ తనకు నచ్చినట్లు తెరకెక్కించి.. పూర్తిగా రామాయణం ఔచిత్యాన్ని, గొప్పదనాన్ని భ్రష్టుపట్టించారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఆదిపురుష్‌ చిత్రం రెండు దేశాల మధ్య వివాదాలను రాజేసింది. సినిమాలో సీతా దేవి జన్మస్థలాన్ని తప్పుగా చూపారంటూ.. నేపాల్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక సినిమాను బ్యాన్‌ చేసింది. ఆదిపురుష్‌ దర్శకుడు, మాటల రచయితను చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఆదిపురుష్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. సినిమాను బ్యాన్‌ చేయాలంటూ.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ వివరాలు..

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బ్యాన్‌ ఆదిపురుష్‌ ట్రెండింగ్‌లో ఉంది. రామాయణం తెరకెక్కిస్తున్నాను అని చెప్పి ఓం రౌత్‌ తనకు నచ్చినట్లు తీసి.. హిందువుల సెంటిమెంట్స్‌ను దెబ్బతీశారని జనాలు పెద్ద ఎత్తున మండి పడుతున్నారు. డైలాగ్‌లు కూడా తప్పుగా రాశారని మండి పడుతున్నారు. దీనిపై స్పందించిన ఆదిపురుష్‌ బృందం ఐదు డైలాగ్స్‌ మార్చుతామని ప్రకటించింది. అయినా సరే సినిమా మీద విమర్శలు మాత్రం ఆగడం లేదు.

ఈ క్రమంలో ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌.. ఆదిపురుష్‌ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సినిమా, దీనిలోని డైలాగ్‌లు.. హిందువులు భక్తిగా కొలిచే శ్రీరాముడి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని.. అందుకే దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఆదిపురుష్‌ సినిమాను బ్యాన్‌ చేయాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీని కోరుతూ లేఖ రాశారు. భవిష్యత్తులో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ సినిమాను ప్రసారం చేయకుండా అడ్డుకోవాలని లేఖలో కోరారు.

అంతేకాక ఆదిపురుష్‌ దర్శకుడు ఓం రౌత్‌, డైలాగ్‌ రైటర్‌ మనోజ్‌ ముంతషీర్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక ప్రభాస్‌, కృతి సనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ఇలాంటి చిత్రంలో నటించేందుకు అంగీకరిండం నిజంగా బాధాకరం అన్నారు. ఈ సినిమా శ్రీరాముడు, రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించిందని.. భారతీయ సినీ చరిత్రలో రామాయణం, రాముడిని తక్కువ చేసి.. ఇంత అవమానకరంగా ఇప్పటి వరకు ఏ చిత్రంలో చూపలేదని.. కానీ ఆదిపురుష్‌ ఆ సాహసం చేసింది అంటూ మండిపడుతున్నారు. రాముడు, రామాయణం పట్ల మనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూపించడంలో ఆదిపురుష్‌ చిత్రం పూర్తిగా విఫలమైంది అంటున్నారు ప్రేక్షకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి