iDreamPost

రాజధాని పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

రాజధాని పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని పై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని తరలింపు పై ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు కానీ అధికారిక ప్రకటన కానీ జారీ చెయ్యనప్పుడు ఆ అంశంలో తాము ఎలా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది. రాజధాని తరలింపుము పై తక్షణమే హై కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ గుంటూరు కి చెందిన న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు అనే న్యాయవాది అభ్యర్ధనని కోర్ట్ తోసిపుచ్చింది.

రాజధాని తరలింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని, అందువల్ల తన వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు బుధవారం సీజే జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ మంథాట సీతారామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీని పై స్పందించిన ధర్మాసనం రాజధాని తరలింపు పై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏవైనా అధికారిక ఉత్తర్వులు వచ్చాయా అని న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రతిగా సుబ్బారావు అలాంటిది ఏమి లేదని చెప్పడంతో, అలాంటప్పడు ఈ అంశంపై ఇంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులేవీ జారీ చేయనప్పుడు.. తరలింపును సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలన్నీ అపరిపక్వమైనవే అవుతాయని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అంత హడావుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజధాని తరలింపు అనేది ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని, ఇది కొన్ని నెలల పాటు జరిగే ప్రక్రియ అని, అందువల్ల ఈ విషయంలో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరమేమి లేదని పేర్కొంది. ఒక వేళ అత్యవసరం అనుకుంటే సంక్రాంతి సెలవులు తరువాత పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని పిటీషనర్ కి కోర్ట్ సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి