iDreamPost

వైఎస్సార్‌తో జగన్‌ పోటీ పడుతున్నారా..?

వైఎస్సార్‌తో జగన్‌ పోటీ పడుతున్నారా..?

రైతే రాజు.. అనే మాటను నిజం చేసేందుకు ప్రయత్నించిన వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నదాతల వృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

దేశానికి అన్నం పెట్టేందుకు అప్పులపాలవుతున్నా కూడా కాడె వదలని రైతన్నకు వెన్ను దన్నుగా నిలబడిన నేత ఎవరని అడిగితే.. ప్రతి రైతు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు చెబుతారు. దేశంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచారు. అదొక్కటే కాదు.. రైతుల కష్టం వడ్డీ వ్యాపారులపాలు కాకుండా.. బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే అవసరమైన పెట్టుబడి అందించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ, అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోతే పూర్తిగా ఆదుకోవడంలోనూ వైఎస్సార్‌ చూపిన చొరవ మరువలేనిది.

వైఎస్సార్‌ తర్వాత మళ్లీ పదేళ్లకు ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ఆ స్థాయిలో ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. రైతే ముందు అనేలా వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. తండ్రికి తగ్గ తనయుడుగానే కాక తండ్రిని మించిన తనయుడుగా వైఎస్‌ జగన్‌ అన్నదాతలకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌ పావలా వడ్డీకే వ్యవసాయ రుణాలు అందిస్తే.. వైఎస్‌ జగన్‌ సున్నా వడ్డీకే రుణాలు అందించాలని నిర్ణయించారు. వచ్చే నెల 10వ తేదీన రాష్ట్రంలోని అన్నదాతలకు వ్యవసాయానికి వడ్డీలేని రుణాలు అందించే పథకం ప్రారంభించనున్నారు.

ఇప్పటికే వైఎస్‌ జగన్‌ అన్నదాతలకు మేలు చేయడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయం చేసే రైతన్నకు ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు. విత్తనాలు, ఎరువులు, పరుగుమందులు, బీమా.. పంట అమ్ముకం, మద్ధతు ధర.. ఇలా ప్రతి ఒక్క విషయంలో రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు సేవలు అందిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం అన్నదాతలు క్యూలలో రోజుల తరబడి నిలబడే రోజులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా చెక్‌ పెట్టింది. ఎరువులు కావాలన్న వారికి ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ చేస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా 13,500 పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు.

పంపు సెట్‌ ఆన్‌ చేసిన ప్రతి సారి రైతన్న మదిలో మెదిలే పేరు వైఎస్సార్‌.. ఇప్పుడు పంట రుణం తీసుకునే సమయంలో వైఎస్‌ జగన్‌ను గుర్తుచేసుకుంటారనడంలో సందేహం లేదు. ప్రభుత్వం ఉంది ప్రజా సంక్షేమం కోసమేనన్న మాటలను నిజం చేసిన వైఎస్సార్, వైఎస్‌జగన్‌లకు అన్నదాతలు రుణపడి ఉంటే.. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రజలందరూ రుణపడి ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి