iDreamPost

భారత్‌పై అమెరికా రెండు దెబ్బలు – విమానాలు, వీసాలపైన నిషేధం

భారత్‌పై అమెరికా రెండు దెబ్బలు – విమానాలు, వీసాలపైన నిషేధం

భారతదేశంపై అమెరికా ఒకేసారి రెండువైపుల దాడికి దిగింది. ఒకవైపు ఇండియా విమానాలపైన నిషేధం విధించిన అమెరికా, మరోవైపు హెచ్‌–1బి వీసాలపైన నిషేధం విధించింది. దీంతో లక్షల మంది భారతీయులు నష్టపోతున్నారు. అమెరికా నిషేధ చర్యలపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

ఇండియా నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలను అమెరికా నిషేధించింది.కరోనా ముసుగులో భారతీయులతో పాటు పబ్లిక్ వ్యక్తులకు టికెట్లు అమ్ముతోందని అమెరికా ట్రాన్స్ పోర్టు డిపార్టుమెంటు ఆరోపించింది. కోవిడ్–19 వల్ల భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా అమెరికాకు ప్రత్యేక విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విమానాల టికెట్లను పబ్లిక్ కు అక్రమంగా అమ్ముతున్నారని అమెరికా ఆరోపిస్తోంది.

అంతేకాకుండా కోవిడ్ కారణం చూపుతూ అమెరికన్ ఎయిర్ లైన్స్ దేశానికి రావడంపై ఇండియా నిషేధం విధించింది. దీని వల్ల తమ ఎయిర్ లైన్స్ ఆర్థికంగా నష్టపోతున్నాయని అమెరికన్ ట్రాన్స్ పోర్టు డిపార్టు మెంట్ పేర్కొంది. ప్రైవేటు విమానాల రాకపోకలపై నిషేధం 30 రోజుల్లో అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

ఒకవేళ ప్రైవేటు విమానాలు నడుపుకోవాలనుకుంటే ఇండియా డిపార్టు మెంటు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ పై ఇండియా నిషేధం ఎత్తేసిన తరువాత తాము తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలిస్తామని తెలిసింది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్‌–1బి, హెచ్‌–2బి, జె, ఎల్‌1, ఎల్‌2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గ్రీన్‌కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్‌ వరకు నిలిపివేశారు. ఈ మేరకు ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.

ఈ ఉత్తర్వులు జూన్‌ 24 నుంచి డిసెంబర్‌ 31 వరకు అమల్లో ఉంటాయి. వలస విధానంలో సమూల సంస్కరణల్ని తీసుకువచ్చి ఇకపై ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేయాలని అధికార యంత్రాంగానికి ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు.

అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నిక కావాలని తహతహలాడుతున్న ట్రంప్‌… తాను తీసుకున్న నిర్ణయం అమెరికన్లకు లాభం చేస్తుందని అంటున్నారు. కరోనా వైరస్‌ వల్ల అమెరికాలో అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని కట్టడి చేసి, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెంచడానికే వలస విధానంలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. గత ఏప్రిల్‌లో 60 రోజుల పాటు ఈ వీసాలపై నిషేధం విధించిన ట్రంప్‌ సర్కార్‌ ఈ ఏడాది చివరి వరకు దీనిని పొడిగించింది. 

వీసాల జారీపై ఈ ఏడాది వరకు నిషేధం పొడిగిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన తరువాత శ్వేతసౌధం అధికారి మీడియాతో మాట్లాడారు. హెచ్‌–1బి, ఎల్‌1 వీసాలపై తాత్కాలిక నిషేధంతో అమెరికాలో 5.25 లక్షల ఉద్యోగాలు ఖాళీ కానున్నాయని అంచనాలున్నట్లుగా చెప్పారు. ఆ ఉద్యోగాలన్నింటినీ అమెరికన్లతో భర్తీ చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ట్రంప్‌ దృష్టి సారించినట్టు ఆయన వెల్లడించారు. 

లాటరీ విధానం రద్దుకు సన్నాహాలు

ఇన్నాళ్లూ హెచ్‌1బి వీసాలను లాటరీ విధానం ద్వారా ఇచ్చేవారని, ఇకపై ఉద్యోగాల్లో తీసుకునే విదేశీ పనివారి నైపుణ్యం, వారికిచ్చే వేతనం ఆధారంగా వీసాలు జారీ చేస్తారని వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు. ‘’ప్రతీ ఏడాది హెచ్‌–1బి వీసాలు 85 వేల వరకు జారీ చేస్తాం. కానీ దరఖాస్తులు 2 నుంచి 3 లక్షలు వస్తాయి. ఇకపై లాటరీ విధానాన్ని రద్దు చేసి ప్రతిభ ఆధారంగా మంజూరు చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు.

ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది. మేరీల్యాండ్‌లో వాషింగ్టన్‌ పోస్ట్‌ యూనివర్శిటీ నిర్వహించిన పోల్‌లో 65శాతం ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. కరోనా వైరస్‌ విసిరిన సవాళ్లతో వలసదారుల నుంచి తమ ఉపాధికి ముప్పు ఉంటుందని 81శాతం అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ చేసిన సర్వేలో వెల్లడైంది. 

అమెరికా వెళ్లాలనుకునే వారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతీ ఏడాది మంజూరు చేసే హెచ్‌–1బి వీసాలు 85 వేలకు వీసాలకు గాను 70శాతం మంది భారతీయులే. వారందరూ ఇక ఏడాది పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

అమెరికాలో వృత్తి నిపుణులకు భారీగా వేతనాలు చెల్లించాలి. విదేశీయులైతే తక్కువ వేతనాలకు వస్తారన్న కారణంగా ఎన్నో బహుళ జాతీయ కంపెనీలు అమెరికన్లకు బదులుగా విదేశీ వర్కర్లను ఉద్యోగాల్లో నియమిస్తున్నాయి. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌ , అమెజాన్, ఫేస్‌బుక్‌ వంటి ఐటీ దిగ్గజాలకు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో ఎదురు దెబ్బ తగలనుంది.

హెచ్‌–1బి వీసాలను అత్యధికంగా స్పాన్సర్‌ చేస్తూ విదేశీ వర్కర్ల సేవల్ని ఎక్కువగా ఈ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. ఇక అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీలు టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్‌ వంటి కంపెనీలూ కూడా తక్కువ వేతనాలకే భారతీయ టెక్కీలను ఉద్యోగాల్లోకి తీసుకొని లబ్ధి పొందుతున్నాయి.

తాజా ఉత్తర్వులతో టెక్‌ కంపెనీలు విదేశీ వర్కర్లను పనిలోకి తీసుకోలేవు. ఆ పని చేసే సామర్థ్యం అమెరికన్లకు లేకపోవడం, వారు ఆ ఉద్యోగాల్లోకి రావడానికి ఇష్టపడకపోవడం కూడా కంపెనీ యజమానుల్లో ఆందోళన పెంచుతోంది.

ట్రంప్‌ నిర్ణయంపై గూగుల్‌ సిఈవో, ఇండియన్‌ అమెరికన్‌ సుందర్‌ పిచాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వలసదారుల పక్షానే తాను ఉంటానని అవకాశాలు అందరికీ ఇవ్వాలన్నారు. ‘’అమెరికా ఆర్థిక విజయాలకు వలస విధానమే ఎంతో తోడ్పడింది. టెక్నాలజీలో గ్లోబల్‌ లీడర్‌గా అమెరికాను నిలిపిందంటే, గూగుల్‌ ఇప్పుడు ఇలా నిలిచిందింటే ఆ విధానమే కారణం’’అని పిచాయ్‌ ట్వీట్‌ చేశారు. 

ట్రంప్‌ కొత్త ఉత్తర్వులపై అమెరికన్‌ కంపెనీల్లోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అమెరికా ఫస్ట్‌ రికవరీ పేరుతో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలని అధ్యక్షుడు భావిస్తున్నప్పటికీ ఈ వీసాలపై నిషేధం పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని అక్కడ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమెరికా వలస విధానాలను వ్యతిరేకంగా ఉందని ఇమ్మిగ్రేషన్‌ నిపుణుల అభిప్రాయంగా ఉంది. న్యూయార్క్‌కి చెందిన ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ సంస్థ వ్యవస్థాపకుడు సైరస్‌ మెహతా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై ఎవరైనా కోర్టుకెక్కే అవకాశం ఉందన్నారు.

‘‘ట్రంప్‌ ప్రకటన ఇమ్మిగ్రేషన్, నేషనాలటీ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకం. ఎవరైనా కోర్టుకెళితే దీనిని నిలిపివేస్తారు. ఇలా నిషేధం పొడిగించడం వల్ల అమెరికాలో కొత్త ఉద్యోగాల కల్పన జరగదు. ఈ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారంతా అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎంతో సాయంగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి