iDreamPost

బాబు అమ్ముల పొదిలో అస్త్రం.. సరైన సమయంలో వదలాలనుకుంటున్నారా..?

బాబు అమ్ముల పొదిలో అస్త్రం.. సరైన సమయంలో వదలాలనుకుంటున్నారా..?

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. నిన్నటి వరకు రాజధాని అమరావతి గ్రామాలో రైతులతో కలసి ఉద్యమాలు, నిరసనలు తెలిపిన చంద్రబాబు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని నిన్న గురువారం మచిలీపట్నం నుంచి ఆచరణలో పెట్టారు.

రాజధాని గ్రామాల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్నా ముఖ్యప్రాత మాత్రం చంద్రబాబు అండ్‌ ఫ్యామిలీదే. రైతుల నిరసన కార్యక్రమాల హాజరవడం, వారికి మద్దతుగా చంద్రబాబు ఆందోళనలు చేయడం నిన్నటి వరకు చూశాం. తన భార్య భువనేశ్వరితో అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ప్లాటినం గాజులు ఇప్పించి ఉద్యమంలో సరికొత్త అంకానికి తెర తీశారు. ఉద్యమానికి విరాళాలంటూ మహిళలు నుంచి ఆభరణాలు, నగదు స్వీకరిస్తున్నారు. అమరావతి గ్రామాల నుంచి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు చంద్రబాబు పూనుకోవడంతో ఇప్పటి వరకు అమరావతిలో చంద్రబాబు పోషించిన పాత్ర లోకి ఆయన తనయుడు నారా లోకేష్‌ వచ్చారు.

‘అమరావతి అందరికీ కావాలి.. కానీ ఇళ్ల నుంచి బయటకు రారు’ అంటూ చంద్రబాబు తన ఆవేదనను నిన్న మచిలీపట్నంలో వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పుటి నుంచి చంద్రబాబు ఉద్యమాలు చేయాలని, ఆందోళనలు నిర్వహించాలని ప్రజలను, విద్యార్థులను, ఉద్యోగస్తులను పలుమార్లు వేడుకున్నారు. పదే పదే తాను కోరుతున్నా ఎవరూ స్పందించడంలేదు. ఈ నేపథ్యంలో ఆయనలోని అసహనం అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తోంది.
అమరావతి పరిరక్షణ జేఏసీ పేరుతో మచిలీపట్నంలో నిర్వహించిన బస్సు యాత్రను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయన కొద్ది దూరం పాదయాత్ర చేశారు. చివరకు తన మెడకు జోలి కట్టుకుని అమరావతి ఉద్యమానికి విరాళాలు ఇవ్వండంటూ తిరిగి సానుభూతి కోసం ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఆశించిన ఫలితం రాకపోగా అమరావతి మాత్రమే ఒకైక రాజధానిగా ఎందుకు ఉండాలో చెప్పకుండా.. విరాళాలు వసూలు చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక చంద్రబాబు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వెళుతున్నారు. అక్కడ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆందోళనలో చంద్రబాబు, టీడీపీ నేతలున్నారు.

Read Also : రాజధాని అంశం.. నేడు ఓ కొలిక్కి తెస్తారా..?

దాదాపు 24 రోజులుగా చంద్రబాబు అరచిగీపెట్టిన, నొత్తినోరు బాదుకుంటున్నా ప్రజల నుంచి స్పందన రావడంలేదు. ఈ నేపథ్యంలో బాబు తన అమ్ముల పొదిలోని ఆస్త్రాన్ని వదిలే సమయం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బాబు తనకు అవసరమైన ప్రతి సమయంలోనూ ఆ ఆస్త్రాన్ని వదులుతుంటారని గతంలో జరిగిన సంఘటనలు ఉదహరిస్తున్నారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల సమయంలో, బీజేపీతో తెగతెంపులు చేసుకుని మోదీపై విమర్శనాస్త్రాలు సందించే సమయంలోనూ బాబు తన బావమరిది, సినీ నటుడు బాలకృష్ణను రంగంలోకి దింపారు. అన్ని సందర్భాల్లోనూ బాలయ్యను చంద్రబాబు మధ్యలోనే.. అదీ సరైన సయమంలోనే రంగంలోకి దింపుతారు.

ఇప్పుడు అమరావతి ఉద్యమం విషయంలో బాలయ్య రంగ ప్రవేశానికి ఆసమయం ఆసన్నమైనట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సీఎం జగన్‌ను, మంత్రులను టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు తీవ్ర విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కానీ సీఎం, మంత్రులు స్పందించడంలేదు. చంద్రబాబు విమర్శలకు కనీసం సమాధానం చెప్పడంలేదు. ఇది చంద్రబాబుకు మరింత అసహనాన్ని కలిగిస్తోంది. ఇలాంటి నేపధ్యంలో బాలయ్య వచ్చి తనదైన శైలిలో విమర్శలు సందిస్తే కొంత ఊపు వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. బాలయ్య వస్తే ప్రజలు కూడా టీడీపీ ఆందోళనలపై దృష్టి సారిస్తారని. సోషల్‌ మీడియాలో కూడా బాలయ్య ప్రశంగాలు టీడీపీతోపాటు, వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు వైరల్‌ చేస్తారని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరి బాబు.. బాలయ్యను రంగంలోకి దింపే సమయం ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి