iDreamPost

చిరంజీవితో గ్యాప్ – అరవింద్ క్లారిటీ

చిరంజీవితో గ్యాప్ – అరవింద్ క్లారిటీ

గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబాల మధ్య ఏదో గ్యాప్ ఉందనే ప్రచారం తరచూ జరుగుతూనే ఉంది. ఒకప్పుడు అల్లు అర్జున్ ఎక్కడ స్టేజి ఎక్కినా మావయ్య చిరు గురించి తప్పనిసరిగా మాట్లాడేవాడు. చెప్పను బ్రదర్ వివాదం తర్వాత అన్నీ పక్కన పెట్టేశాడు. సరిగ్గా ఈ పాయింట్ ని పట్టుకునే మెగా ఫ్యాన్స్ విభేదాల గురించి చాలానే ఊహించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా డిస్కషన్ లు జరిగాయి. బన్నీ అభిమానులు సైతం తమ హీరో ఇక వేరే అన్నట్టుగా ప్రవర్తించిన దాఖలాలు లేకపోలేదు. అయితే ఇటీవలే జరిగిన అల్లు శతజయంతి ఉత్సవాల్లో అందరూ కలిసిమెలిసి ఉండటం చూసి అనుమానాలకు దాదాపుగా చెక్ పడింది.

తాజాగా అల్లు అరవింద్ స్వయంగా ఈ ఇష్యూ గురించి అలీతో టాక్ షోలో ఓపెన్ అయ్యారు. తమ రెండు ఫ్యామిలీస్ ఎంత సన్నిహితంగా ఉంటాయో అందరికీ తెలుసని, చిరంజీవికి బావగా కన్నా స్నేహితుడిగానే ఎక్కువ అనుబంధం ఉందన్న ఆయన పిల్లలు ఇదే ఇండస్ట్రీలో ఎదుగుతున్న క్రమంలో ఆ పోటీ వల్ల బయట వాళ్ళు ఏవేవో అల్లేశారని అవేవి నిజం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికీ పండగలు పబ్బాలు వచ్చినప్పుడు అందరూ కలుసుకోవడం కామనే అని, ఎవరో ఏదో అనుకుంటున్నారని ఆ వీడియోని పబ్లిక్ లో పెట్టడం ఇష్టం లేదని తేల్చేశారు. ఈ సందర్భంగానే తన చెల్లి సురేఖను చిరంజీవికి ఇవ్వాలా వద్దా అనే మీమాంసలో ఉన్నప్పటి సంఘటన కూడా వివరించారు.

అల్లు రామలింగయ్య గారికి చిరంజీవి అల్లుడు కావడానికి మొదటి కారణం ఆయన సతీమణి. ఓసారి వేరే వ్యక్తిని కలుసుకోవడానికి చిరు వీళ్ళ ఇంటికి వస్తే కుర్రాడిని గుర్తుపట్టి ఆరాలు తీసి భర్తతో అతనితో సంబంధం కుదుర్చుకుంటే ఎలా ఉంటుందని అడిగారట. దీంతో ముందు వద్దనుకున్నా మన ఊరి పాండవులు షూటింగ్ టైంలో అల్లు రామలింగయ్యగారు దగ్గర నుంచి అన్ని గుణగణాలు ఉన్నాయని గుర్తించాకే ఏం చేస్తే బాగుంటుందని డివిఎస్ రాజుగారిని సలహా అడిగారట. అబ్బాయి లక్షణంగా గుణవంతుడైనప్పుడు ఇంకెందుకు ఆలోచించడమని ధైర్యం చెప్పి చిరుని అల్లు అల్లుడిగా మారేందుకు మొదటి ఇటుక పేర్చారు. ఇలా చాలా ముచ్చట్లే చెప్పారు కానీ మొత్తానికి గ్యాప్ కు సంబంధించిన గాసిప్స్ కి బ్రేక్ వేసేశారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి