iDreamPost

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రభాస్!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో అర డజనకు పైగా సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ మరో కొత్త సినిమా అంటూ తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆయన లిస్టులో మరో కొత్త ప్రాజెక్ట్ చేరేలా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు మలినేని చెప్పడం విశేషం.

నందమూరి బాలకృష్ణ హీరోగా మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి ఇటీవల విడుదలైంది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పర్లేదు అనిపించుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలినేని కి ‘తదుపరి సినిమా ప్రభాస్ తో చేస్తున్నారని తెలిసింది నిజమేనా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ ‘ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి’ అని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చాడు మలినేని.

మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బాహుబలి తర్వాత ఆయనకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ ఎక్కువగా యువ దర్శకులకే అవకాశమిస్తున్నాడు. పైగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. నెలల వ్యవధిలో ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె ఇలా మూడు చిత్రాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మారుతి సినిమా, స్పిరిట్, మైత్రి ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో రావణం అనే మరో మూవీ కూడా చేయనున్నాడని సమాచారం. ఇలా ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్తున్నాడు. మారుతి సినిమా అయితే కనీసం అనౌన్స్ కూడా చేయకుండానే.. సైలెంట్ గా షూట్ చేస్తున్నాడు. మలినేని ప్రాజెక్ట్ కి కూడా అలాగే ఓకే చెప్పి సర్ ప్రైజ్ చేస్తాడేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి