iDreamPost

మహిళా రక్షణ కోసం మరో అడుగు

మహిళా రక్షణ కోసం మరో అడుగు

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న జగన్ సర్కార్ వారి రక్షణకోసం మరో 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ” మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. 1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికే దిశ పోలీస్‌స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఈ దిశ పెట్రోలింగ్‌ వాహనాలు జీపీఎస్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. ఇప్పటికే దిశ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 900 ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందించనున్నారు. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్‌ వాహనాలకు రూ. 13.85 కోట్లు, విశ్రాంతి గదులకు రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడం, మహిళలకు పటిష్టమైన భద్రత, క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం, ప్రజలకు మరింత చేరువ కావడం, విజిబుల్‌ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం రాష్ట్ర పోలీస్‌ శాఖ దిశ పెట్రోలింగ్‌ను ప్రారంభించింది.

దిశ యాప్‌ తర్వాత.. పని చేసే చోట మహిళలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో సబల అనే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. పని ప్రదేశంలో మహిళలు ఏదైనా ఆపద, లైంగికపరమైన వేధింపులు ఎదుర్కొనే పరిస్థితి నుంచి రక్షణ పొందేందుకు ఈ సబల ఉపయోపడనుంది. ఈ మేరకు ఆపదలో ఉన్న మహిళలు సబలకు ఫిర్యాదు చేసేందుకు అవసరమైన వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 15వ తేదీన సబల వాట్సాప్‌ నంబర్‌ 63026 66254ను ఆవిష్కరించింది. దిశ మాదిరిగానే సబలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత అవగాహన కల్పిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి