iDreamPost

క్రేజీ రీమేక్ లో ఆ ‘ఇద్దరు’ ఎవరో

క్రేజీ రీమేక్ లో ఆ ‘ఇద్దరు’ ఎవరో

ఆచార్యకు కరోనా బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క లూసిఫర్ రీమేక్ తాలూకు స్క్రిప్ట్ పనులను దగ్గరుండి వీడియో కాల్స్ రూపంలో పర్యవేక్షిస్తున్నారట. దర్శకుడు సుజిత్ అందులోనే బిజీగా ఉన్నట్టు తెలిసింది. చాలా కీలకమైన మార్పులు కూడా జరుగుతున్నాయట. ఒరిజినల్ వెర్షన్ లో లేని చాలా సన్నివేశాలు, పాత్రలు సృష్టించినట్టుగా వినికిడి. మోహన్ లాల్ పాత్రను చిరంజీవి చేస్తున్నారు కానీ కథలో ఇంకో రెండు కీలకమైన రోల్స్ ఉన్నాయి. అవి ఎవరు చేయొచ్చనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది.

మొదటిది సెకండ్ హాఫ్ లో వచ్చే జతిన్ పాత్ర. ఇది మోహన్ లాల్ తమ్ముడిగా సాగుతుంది. దీన్ని మలయాళంలో టోవినో థామస్ చేశాడు. బాగా పండింది కూడా. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే జాయెద్ మసూద్ పాత్రను పృథ్వి రాజ్ చేశాడు. ఇది చాలా కీలకమైన మలుపులకు కారణం అవుతుంది. మోహన్ లాల్ తర్వాత ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది ఈ ఇద్దరే. ఇప్పుడు చిరు రీమేక్ లో ఆ రెండు పాత్రలను ఎవరు చేస్తారనే ఉత్సుకత అభిమానుల్లో ఉంది. జతిన్ గా అల్లు అర్జున్ ని ట్రై చేస్తున్నారన్న టాక్ ఉంది కాని పుష్పకు కమిట్ అయిన బన్నీ ఇప్పటికిప్పుడు హెయిర్ స్టైల్ ని మార్చే స్థితిలో లేడు.

పోనీ రామ్ చరణ్ అనుకుంటే ఆల్రెడీ ఆచార్యలో కాంబినేషన్ వచ్చేసి ఉంటుంది కాబట్టి వెంటనే అంటే బాగుండదు. అలా అని ఎవరో చిన్న ఆర్టిస్ట్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. దీనికి సంబంధించి గట్టి కసరత్తే జరుగుతోందట. ఇక పృథ్విరాజ్ బదులు సల్మాన్ ఖాన్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా మెగా క్యాంప్ లో ఉందట. ఎలాగూ మంచి బాండింగ్ ఉంది కాబట్టి కండల వీరుడు ఒప్పుకుంటారానే నమ్మకంతో డిస్కషన్ జరుగుతోందట. అయితే ఇదంత సులభమేమి కాదు. మొత్తానికి ఆ ఇద్దరు ఎవరనే సస్పెన్స్ మాత్రం ఇంకొన్నాళ్ళు కొనసాగక తప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి