iDreamPost

ఎవరీ పరిమళ్ నత్వాని ??

ఎవరీ పరిమళ్ నత్వాని ??

జార్ఖండ్ నుండి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికైన పరిమళ నత్వాని ఈ సారి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ కి ఎంపికయ్యారు. ఎవరూ ఊహించని విధంగా చివరి నిమిషంలో అంబానీ ద్వారా తెరపైకి వచ్చిన ఈ పేరు ఇప్పుడు తెలుగు రాజకియ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రిలయన్స్ అధినేతకు స్నేహితుడిగా , మోడీ , అమిత్ షాలకు అత్యంత దగ్గర మనిషిగా పేరు ఉన్న పరిమళ నత్వాని దేశ వ్యాపార రంగాల్లో కీలకమైన వ్యక్తిగా చెబుతారు. అలాగే ప్రస్తుత దేశ రాజకీయాలను ఒంటి చేత్తో తిప్పగల సత్తా ఉన్న నేత గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎవరీ పరిమళ్ నత్వాని ?

గుజరాత్ రాష్ట్రంలోని జాం కంబాలియా అనే గ్రామం లో దీరజ్ లాల , పుష్పా బెన్ దంపతులకు 1956 ఫిబ్రవరి 1న జన్మించిన నత్వాని ముంబైలోని ఎన్.యం కాలేజీలో బి.కాం పూర్తి చేశారు, ఉద్యోగంలో కాకుండా సొంతగా వ్యాపారం పెట్టుకుని రాణించాలనే లక్ష్యం ఉన్న నత్వాని మొదటిసారి పార్లే గ్రూప్ కి చెందిన ప్రకాష్ చౌహాన్ , రమేష్ చౌహాన్ మొదలు పెట్టబోయే డీలర్ షిప్ వ్యాపారంలో భాగస్వామ్యం అయ్యారు. వ్యాపారంలో మెళుకువులు నేర్చుకుని పుంజుకున్న తరువాత 30ఏళ్ళకే సన్ రైజ్ సోప్స్ అండ్ కెమికల్స్ డీలర్ షిప్ ని సొంతం చేసుకున్నారు. వీటితో పాటు బరోడాలో ఎస్.ట్.డి – పి.సి.ఒ వ్యాపారం, స్టాక్ ఎక్సేంజ్ వ్యాపారం అంటు అనేక రంగాల్లో వ్యాపార ప్రయోగాలు చెసి సత్ఫలితాలు అందుకున్నారు .

రిలయన్స్ అధినేతతో పరిచయం

1995లో కొటాక్ సెక్యూరిటీస్ కి రిలయన్స్ సంస్థలకి మద్యవర్తిత్వం నిర్వహిస్తున్న రోజుల్లో దీరుభాయి అంబాని స్వయంగా నత్వానిని పిలిచి గుజరాత్ లోని జాం నగర్ దగ్గర ఏర్పాటు చెయాలని అనుకున్న ఆయిల్ రిఫైనరీకి సంభందించి రైతుల నుండి బారి ఎత్తున 10వేల ఎకరాల భూ సమీకరణలో , అలాగే అందులో పని చేసే వారికోసం ఫ్లాట్స్ కొనడంలోను తాము ఎదుర్కుంటున్న సమస్యలను చెప్పి పరిష్కరించమని కోరగా నత్వాని ఆ సమస్యలను అత్యంత చాకచక్యం ప్రదర్శించి పరిష్కరించారు. దీంతో నత్వాని అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. 1997లో రిలయన్స్ గ్రూప్ లో చేరిన నత్వాని 2016 వచ్చేసరికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహరాల గ్రూప్ కి అధ్యక్షుడు అయ్యారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానికి అత్యంత దగ్గర మనిషిగా , రిలయన్స్ సంస్థ ఎదుగుదలలో కీలకమైన వ్యక్తిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

జార్కండ్ నుంచి రాజ్యసభకు

రిలయన్స్ సంస్థ రిలయన్స్ ట్రెండ్స్ ని మొదలుపెట్టిన రోజుల్లో ఒక భూ సమస్యకు సంభందించి దాని పరిష్కారం కొరకు జార్ఖండ్ లో నివాసం ఉంటున్న అడ్వకేట్ జనరల్ ని కలవటానికి నత్వాని వెళ్ళగా అతని ద్వారా రాజ్యసభ ఎన్నికల్లో పోటి చేసే అవకాశం వచ్చింది. అప్పటికే మోడి అమిత్ షాల తో అత్యంత సానిహిత్యం ఏర్పడటంతో ఆ ఎన్నికల్లో గెలవటానికి శాసన సభ్యుల సంతకాలు అవసరం కాగా అమిత్ షా చొరవతో 18మంది భారతీయ జనతా పార్టీ సభ్యులు సంతకాలు చేయడంతో నత్వాని 2008లో తొలిసారి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు, తరువాత 2014 లో మరో సారి జార్కండ్ నుండే ఎన్నికయ్యరు. గుజరాత్ అల్లరల సమయంలో కూడా మోడీకి న్యాయ సలహాలు అందించటంలో నత్వాని కీలక పాత్ర పోషించారని చెబుతారు.

ముకేష్ అంబానీ లాంటి కార్పోరేట్ దిగ్గజం నేరుగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రి జగన్ ని కలిసి పరిమళ్ నత్వాని కి రాజ్యసభ ఇవ్వమని కోరడం , దానికి ప్రతిగా రాష్ట్ర అభివృద్దికి తమ సహకారం అందిస్తాం అని హామీ ఇవ్వడం దీనికి ముఖ్యమంత్రి జగన్ అంగీకరించడంతో రాష్ట్రంలో పారిశ్రామిక అబివృద్దికి బలమైన పునాది పడిందని రాజకీయ విశ్లేషకుల మాట. రాజకీయ పరంగా మోడి అమిత్ షా కి అత్యంత దగ్గర మనిషిగా గుర్తింపు ఉన్న పరిమళ్ నత్వాని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య బలమైన సంబందాలు ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించబోతున్నారు అని చెప్పటంలో సందేహం లేదు. నత్వాని చేరికతో జగన్ బలం కేంద్రంలో పెరగడం ఒకెత్తు అయితే, రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదు అని ఆరోపణలు చెసే విపక్షాలకు ఈ పరిమళ్ నత్వానినే గట్టి సమాధానం కాబోతున్నారు ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి