iDreamPost

ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు.. అత్తయ్య వాళ్లింటికి మారుతున్నాం!

  • Published Jun 16, 2023 | 12:41 PMUpdated Jun 16, 2023 | 12:41 PM
  • Published Jun 16, 2023 | 12:41 PMUpdated Jun 16, 2023 | 12:41 PM
ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు.. అత్తయ్య వాళ్లింటికి మారుతున్నాం!

ఈ ఏడాది మెగా ఫ్యామిలీలోకి వరుస సంతోషాలు క్యూ కడుతున్నాయి. ముందుగా.. ఈ ఏడాది మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడు. త్వరలోనే రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇక ఇదే ఏడాది రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ట్రిపుల్‌ ఆర్‌ చిత్రానికి ఆస్కార్‌ అవార్డ్‌ వచ్చింది. గతేడాది వరుస ప్లాప్‌లు చవి చూసిన చిరంజీవి.. ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే వరుణ్‌ తేజ్‌ నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది సంతోషాలన్ని మెగా ఫ్యామిలీలోనే ఉన్నాయి అనిపిస్తోంది.

అన్నింటికన్నా సంతోషకరమైన వార్త ఏంటంటే.. ఉపాసన ప్రెగ్నేంట్‌ అవ్వడం. పెళ్లై 10 ఏళ్లు అవుతున్నా.. రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులకు పిల్లలు కలగకపోవడంపై అనేక రకాల వార్తలు వచ్చాయి. వాటికి చెక్‌ పెడుతూ.. త్వరలోనే వారు తమ మొదటి బిడ్డను ఆహ్వానించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉపాసన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారింది.

ఉపాసన.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తమ వ్యక్తిగత జీవితం, కుటుంబానికి సంబంధించిన అంశాలే కాక.. సామాజిక అంశాల గురించి నిత్యం సోషల్‌ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌ చేస్తారు ఉపాసన. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరలవుతోంది. బిడ్డ కోసం ఆమె తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకు ఉపాసన ఏం నిర్ణయం తీసుకుంది అంటే.. త్వరలోనే నేను, రామ్‌ చరణ్‌ మా అత్తమామ(చిరంజీవి, సురేఖ)ల దగ్గరకు షిఫ్ట్‌ అవ్వబోతున్నాం. పుట్టబోయే బిడ్డ సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు.

కొన్నిరోజుల క్రితమే రామ్‌ చరణ్‌-ఉపాసనల 11వ పెళ్లి రోజు జరిగింది. ఈ క్రమంలో ఆమె ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాసన దంపతులు త్వరలోనే అత్తమామలు చిరంజీవి-సురేఖల దగ్గరకు షిఫ్ట్‌ అవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. ‘‘ఏవరైనా పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారు. కానీ మేం దానికి పూర్తిగా భిన్నం. ప్రస్తుతం నేను, చరణ్‌ ఇద్దరం కలిసి విడిగా ఉంటున్నాం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత మేం అత్తమామలతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే.. చరణ్‌, నా ఎదుగుదలలో.. మా గ్రాండ్‌ పేరెంట్స్‌ ఎంతో కీలక పాత్ర పోషించారు. వారి దగ్గర నుంచి మేం ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం’’ అని చెప్పుకొచ్చారు.

‘‘పైగా పెద్ద వారి సంరక్షణలో పిల్లలు చిన్నతనం నుంచే మంచి అలవాట్లు, నడవడక నేర్చుకుంటారు. పిల్లలు, తమ నానమ్మ, తాతయ్యలతో ఉండటం వల్ల పొందే ఆనందాన్ని మా బిడ్డకు దూరం చేయాలని అనుకోవడం లేదు. అందుకే వాళ్లతోనే ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని తెలిపారు. ఉపాసన వ్యాఖ్యలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పిల్లలను, గ్రాండ్‌ పేరెంట్స్‌ నుంచి దూరం చేస్తున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి మీ మాటలు కనువిప్పు కావాలి అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి