iDreamPost

ఈ నెల 13న థియేటర్లలోకి రాబోతున్న’యూనివర్శిటీ‘: ఆర్ నారాయణ మూర్తి

ఈ నెల 13న థియేటర్లలోకి రాబోతున్న’యూనివర్శిటీ‘: ఆర్ నారాయణ మూర్తి

తన సినిమాల ద్వారా ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనుకునే అతి కొద్దీ మంది నటులు, దర్శకుల్లో ఒకరు ఆర్ నారాయణ మూర్తి. చాలా ఆ అందుకే ఆయనకు పీపుల్స్ స్టార్ అన్న ముద్ర పడింది. దేశంలో జరుగుతున్న సంఘనల ఆధారంగా ఆలోచింప చేసే సినిమాలు తీస్తూ ఉంటారు. అర్థరాత్రి స్వతంత్య్రం, అడవి దివిటెలు, లాల్ సలామ్, దండోరా, ఎర్రసైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యుడు, ఊరు మనదిరా, ఒరేయ్ రిక్షా, పోరు తెలంగాణ, రైతన్న వంటి సినిమాలు ఈ కోవకే వస్తాయి. ఇప్పుడు యూనివర్శిటీ అనే పేరుతో మన ముందుకు వస్తున్నారు. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో ప్రివ్యూను వేశారు. ప్రముఖులు ఈ సినిమాను వీక్షించారు.

విద్యా వ్యవస్థపై రూపొందించిన ఈ చిత్రాన్ని తిలకించిన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఆర్ నారాయణ మూర్తి మంచి సినిమాను తీశారని, ఈ సినిమాను నా అభిమానులతో పాటు అందరూ చూడాలని కోరారు. ఈ సినిమా దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. చదువుకొనే రోజుల్లో పేపర్ లీకేజ్ ఉన్నాయని, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లోనూ పేపర్ లీకేజ్ జరుగుతుందని, విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్ని సార్లు పరీక్షలు రాయలంటూ ప్రశ్నించారు. పరీక్షలు మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో అడుకోడం దుర్మార్గమని, విద్యార్థులు జాతి సంపదని, వాళ్ళను రక్షించికోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ఆ బాధ్యత మనందరిపై, ప్రభుత్వాలపై ఉందని అన్నారు. యూనివర్శిటీ మూవీ ఈ నెల 13న థియేటర్లలో విడుదల అవుతుందని చెప్పారు.

ప్రొఫెసర్ హర గోపాల్ మాట్లాడుతూ..విద్యార్థులే కాకుండా, అధ్యాపకులు కూడా చూడాల్సిన మూవీ అని అన్నారు. గత 40 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదూ.. మన దేశంలోనూ జరిగిన, జరుగుతున్న సమస్యలకు స్పందించి.. ఆర్ నారాయణమూర్తి సినిమాలు తీస్తూ భావితరాలకు తెలిసేలా సినిమాల రూపంలో చరిత్రను నిక్షిప్తం చేస్తున్నందుకు అభినందిస్తున్నానని అన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ.. మన దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాధమిక దశ నుంచి మాతృ భాషతో పాటు ఇంగ్లీష్‌ను నేర్పిస్తూ.. మౌళిక సదుపాయాలు సమకూర్చి, క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ అందిస్తే.. ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం అవుతుందని అన్నారు.

అప్పుడు ప్రైవేట్ విద్య అనేది ఉండదని, పిల్లల్ని పీల్చి పిప్పి చేసే ఫీజుల దోపిడీ ఆగుతుందని ఐలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, బీసి నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, జూలూరి గౌరీ శంకర్, పాశం యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ కాశిం, బిసి నాయకులు గణేశ చారి, దర్శకులు కాశీ విశ్వనాథ్ , వైఎస్ కృష్ణేశ్వర రావు సినిమాను వీక్షించి,  తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి