iDreamPost

Puneeth Rajkumar : కనివిని ఎరుగని స్థాయిలో పునీత్ కు సంతర్పణ

Puneeth Rajkumar : కనివిని ఎరుగని స్థాయిలో పునీత్ కు సంతర్పణ

విధి రాతను ఎవరూ తప్పించలేరు. స్వంత అన్నయ్య నటించిన కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రెండు రోజులకే పునీత్ రాజ్ కుమార్ మన మధ్య ఉండడని ఎవరు ఊహించారు. యావత్ సినీ అభిమానుల గుండెలను పిండేసిన ఈ మరణం కదిలించినంతగా ఈ మధ్య కాలంలో ఇంకెవరి కడచూపు ఇంత గొప్ప నివాళి దక్కించుకోలేదు. ఇక్కడితో అయిపోలేదు. పునీత్ మీద తమకు ఎంత ప్రేమ ఉందో కర్ణాటక ప్రజలు పదే పదే ఋజువు చేస్తూనే ఉన్నారు. నిన్న 11వ రోజు సందర్భంగా శాండల్ వుడ్ పవర్ స్టార్ స్మరణార్థం చేసిన సంతర్పణకు జనం వేలాదిగా తరలివచ్చారు . కనివిని ఎరుగని సందోహం చూసి రాజ్ కుమార్ కుటుంబం ఆశ్చర్యపోయింది.

నిన్న ఉదయం మొదలుపెట్టిన అన్నదాన కార్యక్రమం సాయంత్రం దాకా కొనసాగుతూనే వచ్చింది. 300 పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 12 గంటల చొప్పున రెండు షిఫ్టులలో డ్యూటీలు వేశారు. 40 వేలకు పైగా అభిమానులు వచ్చి భోజనం చేసారని ఒక అంచనా. ఇంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. నాన్ వెజ్ కోసం పాతిక వేల కిలోల చికెన్ ని వండారు. బియ్యం పదుల సంఖ్యలో టన్నులు వండి వార్చారు. వీటితో పాటు భక్ష్యాలు ఇతర కర్ణాటక సాంప్రదాయ ఆహార పదార్థాలు అన్నీ రాజీ లేకుండా చేయించారు. రెండు కిలోమీటర్ల దాకా క్యూ లైన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాయంటేనే అర్థం చేసుకోవచ్చు పునీత్ గొప్పదనం.

తాను లేకపోయినా సేవా కార్యక్రమాలు ఆగకూడదనే ఉద్దేశంతో పునీత్ రాజ్ కుమార్ డిపాజిట్ చేసి ఉంచిన 8 కోట్ల రూపాయల విషయం తమకు తెలియదని అన్న శివ రాజ్ కుమార్ చెప్పడం విశేషం. కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదని తండ్రి చెప్పిన మాట అప్పు అక్షరాలా పాటించాడని, దానికి సోదరుడిగా తనకెంతో గర్వంగా ఉందని చెప్పి మీడియాను సైతం ఆశ్చర్యపరిచారు. ఈనెల 16న సినీ పరిశ్రమ తరఫున ప్యాలస్ గ్రౌండ్స్ లో మరో కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దీనికి అతిరథ మహారథులు విచ్చేయబోతున్నారు. దీనికి సాధారణ పబ్లిక్ ను అనుమతించరు. టీవీ లైవ్ టెలికాస్ట్ ఇవ్వబోతున్నారు

Also Read : Reality Shows : ఎంత రచ్చ చేస్తే అంత రేటింగ్ తరహాలో ప్రోగ్రాంలు 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి