iDreamPost

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. ‘దత్తత వెళ్లిన వారికి ఆ ఆస్తిలో హక్కు ఉండదు’!

  • Published Jul 04, 2023 | 2:42 PMUpdated Jul 04, 2023 | 2:42 PM
  • Published Jul 04, 2023 | 2:42 PMUpdated Jul 04, 2023 | 2:42 PM
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. ‘దత్తత వెళ్లిన వారికి ఆ ఆస్తిలో హక్కు ఉండదు’!

దత్తత వెళ్లిన సంతానానికి సంబంధించి.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వారికి అసలు తల్లిదండ్రుల ద్వార సంక్రమించే ఆస్తిపై ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఈమేరకు రాష్ట్ర హైకోర్టు తీర్పు వెల్లడించింది. దత్తత వెళ్లిన సంతానం తమ పూర్వీకుల ఆస్తిలో.. సొంత కుటుంబంలోని ఇతర సభ్యులతో పాటు ఉండే సమాన హక్కులు కోల్పోతారని తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్‌ స్పష్టం చేసింది. ఒకే వ్యక్తి రెండు కుటుంబాల్లో ఉండరని, అలాంటప్పుడు ఆస్తి మాత్రం రెండు కుటుంబాల్లో ఎలా ఉంటుందని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.

అయితే సదరు వ్యక్తులు.. దత్తత వెళ్లడానికి ముందే.. వారి సొంత కుటుంబంలో ఆస్తి పంపకం జరిగిత.. అప్పుడు వారి వాటా కింద ఆస్తిని పొందితే.. దత్తత వెళ్లిన తర్వాత కూడా అవది వారికే చెందుతుందని కోర్టు తెలిపింది. కానీ ఆస్తి పంపకాలు అనేవి దత్తత తర్వాత జరిగితే అప్పుడు మాత్రం.. దత్తత వెళ్లిన సంతానానికి సొంతం కుటుంబం ఆస్తిలో హక్కులుండవు అని స్పష్టం చేసింది.

అసలు కేసు ఏంటంటే..

దత్తత వెళ్లినప్పటికీ.. తాను జన్మించిన కుటుంబం ఆస్తిలో కూడా వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఎవిఆర్‌ఎల్‌ నరసింహారావు అనే వ్యక్తి 1980 సంవత్సరంలో ఖమ్మం సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ‘యార్లగడ్డ నాయుడమ్మ వర్సెస్ ఏపీ ప్రభుత్వం’లో దత్తత వెళ్లిన వ్యక్తికి సహజ కుటుంబానికి చెందిన అవిభాజ్య ఆస్తిలో కూడా స్వాభావిక హక్కు ఉంటుందని, దత్తత తీసుకున్న తర్వాత కూడా దానిపై హక్కు కొనసాగుతుందని ప్రకటించింది.

ఈ తీర్పు ఆధారంగా తెలంగాణ హైకోర్టు.. నరసింహరావు పిటిషన్‌ను విచారణ జరిపి.. అతడికి సహజంగా జన్మించిన కుటుంబంలోని ఆస్తిలో కూడా వాటా ఉంటుందంటూ తీర్పు వెలువరించింది. అయితే నరసింహరావు సోదరుడు ఏ నాగేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు.. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ 1985లో హైకోర్టులో దావా వేయగా.. కోర్టు దానిని కొట్టేసింది. రివ్యూ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది.

హైకోర్టు ఫుల్‌బెంచ్‌ తీర్పు ఏం చెప్పిందంటే

ఆ తర్వాత నాగేశ్వరరావు పేటెంట్‌ అప్పీల్‌ దాఖలు చేశాడు. 2001లో అది హైకోర్డు డివిజన్‌ బెంచ్‌ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో గతంలో నాయుడమ్మ కేసులో ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ అంగీకరించలేదు. దాంతో ఈ కేసును విచారించేందుకు కోర్టు ఫుల్‌బెంచ్‌ను ఏర్పాటు చేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసును న్యాయమూర్తులు జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు, జస్టిస్‌ బొల్లం విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకలతో కూడిన ఫుల్‌బెంచ్‌ సుదీర్ఘంగా విచారించి ఇటీవల తీర్పు వెలువరించింది.

దత్తత వెళ్లిన తర్వాత అతను/ఆమె పుట్టిన కుటుంబంతో సంబంధాలు తెగిపోతాయి. దత్తతగా వెళ్లిన కుటుంబ బంధాలను పొందుతారని చట్టం చెబుతున్నట్లు ఫుల్‌ బెంచ్‌ తెల్పింది. దత్తత తర్వాత సొంతంకుటుంబంతో సంబంధాలు తెగిపోయిన మాదిరిగానే.. పుట్టిన కుటుంబం ఆస్తిలో హక్కును కూడా కోల్పోతారని బెంచ్‌ స్పష్టం చేసింది. పుట్టిన కుటుంబంలో దత్తతకు ముందు పూర్వీకుల ఆస్తి కేటాయించకపోతే ఎటువంటి హక్కు ఉండదని తెల్పుతూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి