iDreamPost

జగన్ పారదర్శక పాలనకు ఇంతకన్నా నిదర్శనం కావాలా ?

జగన్ పారదర్శక పాలనకు ఇంతకన్నా నిదర్శనం కావాలా ?

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక సంక్షేమ పథకాల అమలులో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో తన పాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నాడు. జగన్ పాలనపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా మెజారిటి జనాలైతే సానుకూలంగానే ఉన్నారన్నది వాస్తవం. తాజాగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ విషయంలో ప్రతిపక్షాలు ప్రత్యేకించి చంద్రబాబునాయుడు ఎంత గోల చేస్తున్నాడో అందరు చూస్తున్నదే.

కంపెనీ యాజమాన్యానికి జగన్ మద్దతుగా ఉన్నాడంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తు ఎల్లోమీడియాలో కూడా ఒకటికి పదిసార్లు రాయిస్తున్నాడు. అయితే అదే మీడియాలోనే జగన్ పారదర్శకత గురించి ఓ వార్త వచ్చింది. కాకపోతే ఆ వార్తను చిన్నదిగా వేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే గ్యాస్ లీకేజీ ప్రమాదం విషయంలో కేంద్రప్రభుత్వ విభాగాలను కూడా జగన్ భాగస్వాములను చేయాలని నిర్ణయించాడు.

ఇందులో భాగంగానే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలతో పాటు పరిశ్రమలు, ఆర్ధిక వ్యవహార మంత్రిత్వ శాఖలకు కూడా రాష్ట్రప్రభుత్వం లేఖలు రాసింది. ప్రమాదంపై రాష్ట్రప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటిలో పై శాఖలకు చెందిన ఉన్నతాధికారులను కూడా సభ్యులుగా నియమించాలని కోరుతు రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి లేఖ రాసింది.

ప్రమాదానికి సంబంధించి జరుగుతున్న విచారణలో చంద్రబాబు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలే నిజమైతే కేంద్రప్రభుత్వంలోని శాఖలకు జగన్ ఎందుకు లేఖలు రాస్తాడు ? హై పవర్ కమిటితోనే విచారణ చేయించేసి ప్రమాదం మానవతప్పిదం కాదని తేల్చేసే వాడే కదా ? కానీ అలా చేయకుండా ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యం ఉండబట్టే కేంద్రమంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులను కూడా సభ్యులుగా నియమించాలని అనుకున్నాడు.

పైగా ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన విధానం, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వటం లాంటి అనేక విషయాల్లో జగన్ స్పీడు చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే ఏదో ఓ పనికిమాలిన ఆరోపణలు చేస్తు ప్రచారంలో ఉండాలని అనుకుంటున్నాడు. మరి జగన్ పారదర్శకత విషయంలో వాళ్ళ మద్దతు మీడియాలోనే వచ్చిన వార్తకు చంద్రబాబు ఏమని సమాధానం చెబుతాడు ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి