iDreamPost

11 ఏళ్ళ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ?

11 ఏళ్ళ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ?

ఇండియన్ వెబ్ సిరీస్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండు సీజన్లలో టైటిల్ రోల్ తో అదరగొట్టిన మనోజ్ బాజ్ పాయ్ డిమాండ్ ఇప్పుడు మాములుగా లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సహజంగానే బిజీగా ఉండే ఈ విలక్షణ నటుడు అడపాదడపా తెలుగు సినిమాల్లో నటించడం అలవాటే. వర్మ తీసిన ‘ప్రేమకథ’తో తొలిసారి టాలీవుడ్ స్క్రీన్ మీద కనిపించిన మనోజ్ ఆ తరువాత అల్లు అర్జున్ ‘హ్యాపీ’లో చేసిన పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ క్యారెక్టర్ అందరికీ బాగా నచ్చింది. క్రిష్ తీసిన ‘వేదం’లోనూ గుర్తుండిపోయారు. పవన్ ‘కొమరం పులి’లో మెయిన్ విలన్ గా చేసినా లాభం లేకపోయింది.

ఇది జరిగింది 2010. మళ్ళీ మనోజ్ మనవాళ్లకు దర్శనమివ్వలేదు. కట్ చేస్తే ఇప్పుడు పదకొండేళ్ల తర్వాత ప్రభాస్ సలార్ లో కనిపించబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ముఖ్యమైన ప్రతి నాయకుడిగా మనోజ్ బాజ్ పాయ్ నటించబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ గ్రాండియర్ 1970 నేపథ్యంలో సాగుతుందట. హీరోయిజం ఓ రేంజ్ లో ఎలివేట్ చేయబోతున్నారనే టాక్ ఇప్పటికే ఉంది. హీరోయిన్ శృతి హాసన్ ఇటీవలే ఈ టీమ్ తో కొత్త షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది. ఇక వేగం పెంచబోతున్నారు.

మనోజ్ బాజ్ పాయ్ తోడైతే సలార్ కు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ ఫిలింస్ తో బిజీగా మారిన ఇతను ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలుగులో మళ్ళీ చేయాలనుందని చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే నెల ద్వితీయార్థం విడుదలకు ప్లాన్ చేసుకున్న సలార్ తర్వాత ప్రభాస్ ఆది పురుష్ రిలీజ్ ఉంటుంది. కాకపోతే ముందు అనుకున్న డేట్లకు వస్తాయా రావా అనేది అనుమానమే. ప్రతిదీ పాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ప్రభాస్ సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ నటీనటులు పోటీ పడుతున్నారు. ఇదైతే వాస్తవమే

Also Read :  నాని చైతులు ఒకే రోజు రాబోతున్నారా ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి