iDreamPost

గోవాలో గెలిచిన ప్రశాంత్ కిషోర్

గోవాలో గెలిచిన ప్రశాంత్ కిషోర్

గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అధికారాన్ని నిలబెట్టుకుంటూ అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. గోవాలో బీజేపీ 20 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలిచి మరో స్థానములో ముందంజలో ఉంది. గోవాలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా నేడు సాయంత్రం బీజేపీ నేతలు గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై కలవనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు గెలుపొందిన బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తొలుత చిన్న పార్టీలతో జతకట్టి బీజేపీ అధికారాన్ని చేపట్టగా.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పర్యాటక రాష్ట్రంగా పేరుగాంచిన గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ లేదా కూటమి అయినా 21 సీట్లు సాధిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాబట్టి బీజేపీ దాదాపు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AIMC) ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఆశించిన రీతిలో పనిచేశాయి. టీఎంసీ ప్రధాన కార్యదర్శి మరియు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్‌తో కలిసి గోవాలో ఉన్నారు మరియు గోవాలో ఎన్నికల ఫలితాలు పర్యవేక్షిస్తున్నారు. గోవాలో టీఎంసీ 26 స్థానాల్లో, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 13 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఎన్నికలకు ముందు, చాలామంది మాజీ గోవా కాంగ్రెస్‌, మాజీ బీజేపీ నాయకులు టీఎంసీలో చేరారు. దానికి వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. పశ్చిమ బెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత, మమతా బెనర్జీ ఈసారి తృణమూల్ ‘టార్గెట్ ఢిల్లీ’ అని ప్రకటించారు.

బెంగాల్‌లో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎంపీ అభిషేక్ బందోపాధ్యాయను పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ తరువాత బెంగాల్ వెలుపల పార్టీని విస్తరించే బాధ్యతను అప్పగించారు. ఇందుకోసం అభిషేక్ బెనర్జీ మొదటగా త్రిపురలో అడుగుపెట్టి తమ పార్టీని గోవాకు విస్తరించే ప్రయత్నం చేశారు. మమత-అభిషేక్ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి లూయిసిన్హో ఫలేరోను పార్టీలో చేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీని బలోపేతం చేసేందుకు, ఫలీరోను అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, అలాగే రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు.

కేవలం ప్రశాంత్ కిషోర్ ఇన్‌పుట్‌లు, ఎన్నికల వ్యూహాలపై ఆధారపడి మాత్రమే టీఎంసీ పెద్ద ఎత్తున ఈ గోవా ఎన్నికల్లో ప్రవేశించిందని చెప్పవచ్చు. అక్కడ పార్టీ బాధ్యతలు వహిస్తున్న మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పూర్తిగా ప్రశాంత్‌పైనే ఆధారపడి ఉన్నారు. ప్రశాంత్ ఎన్నికల సామర్థ్యాలపై భారీ నమ్మకం ఉంచి, టీఎంసీ గోవాపై భారీగా ఆశలు పెట్టుకుంది. మొత్తం టీఎంసీ ప్రచారానికి ఐ-ప్యాక్ బాధ్యత వహించింది. అలా అసలు ఎక్కడో బెంగాల్ లోని మమతా పార్టీ కేవలం ప్రశాంత్ కిషోర్ కారణంగా గోవాలో రెండు సీట్లతో ఖాతా తెరిచింది. ప్రస్తుతానికి గట్టి మెజారిటీ వచ్చింది కానీ అది రాకుంటే కనుక టీఎంసీ కూటమి కింగ్ మేకర్ కూడా అయి ఉండేది. మొత్తం మీద గోవాలో తృణమూల్ కాంగ్రెస్ కాదు ప్రశాంత్ కిషోర్ గెలిచినట్టయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి