iDreamPost

నేటి నుండి మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ….

నేటి నుండి మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ….

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను ఆదుకునే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతగా ఉచిత రేషన్ ను నేటి నుండి వచ్చే నెల 10 వరకు పంపిణీ చేయనుంది.పంపిణీ చేసేందుకు వీలుగా ఇప్పటికే సరుకులు రేషన్‌ షాపులకు చేరుకున్నాయి.

గతంలో రెండువిడతల్లో రేషన్ సరుకులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మొదటి విడతలో మార్చి 29 నుంచి పంపిణీ చేయగా, రెండో విడతలో ఈ నెల 16 నుంచి సరుకులు పంపిణీ చేశారు. రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యంతోపాటు ప్రతి కార్డుకు కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తారు. మూడో విడత పంపిణీలో సుమారు1.48 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

మొదటి రెండు విడతల్లో బయో మెట్రిక్ లేకుండానే ఉచిత సరుకులు అందజేశారు. కానీ మూడో విడత రేషన్ సరుకుల పంపిణీలో ఉచిత సరుకులు తీసుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయాల్సిందే . కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రేషన్‌ షాపులు, అదనపు కౌంటర్ల వద్ద శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు, నీళ్లు అందుబాటులో ఉంచారు.

రేషన్‌ అందకపోయినా,రేషన్ పంపిణీలో ఇతర ఇబ్బందులు ఉంటే 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి లబ్ధిదారులు ఫిర్యాదు చేయొచ్చు. 28,354 రేషన్‌ షాపులు, 15,331 అదనపు కౌంటర్లు కలిపి 43,685 చోట్ల లబ్ధిదారులకు ఉచిత సరుకులు పంపిణీ చేయనున్నారు. రేషన్‌ కార్డులు ఎక్కువ ఉన్న రేషన్‌ షాపులకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ తీసుకుంటున్న వారికి, వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే సరుకులు తీసుకునేందుకు వీలు కల్పించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి