iDreamPost
android-app
ios-app

ప్రజలకు అలర్ట్‌.. దావత్‌లు, ఫంక్షన్‌లు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త

  • Published Jul 13, 2024 | 3:03 PMUpdated Jul 13, 2024 | 3:03 PM

Telangana Excise Officials-Functions, NDPL: ప్రజలకు అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. దావత్‌లు, ఫంక్షన్‌లు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

Telangana Excise Officials-Functions, NDPL: ప్రజలకు అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. దావత్‌లు, ఫంక్షన్‌లు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

  • Published Jul 13, 2024 | 3:03 PMUpdated Jul 13, 2024 | 3:03 PM
ప్రజలకు అలర్ట్‌.. దావత్‌లు, ఫంక్షన్‌లు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త

పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషి జీవితంలో ఎన్నో ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. చావు, పుట్టుకల మధ్య పెళ్లితో పాటు అనేక శుభకార్యాలు నిర్వహిస్తాము. మిగతా ప్రాంతాల సంగతి తెలియదు కానీ.. తెలంగాణలో మాత్రం చావైనా, పుట్టుకైనా వేడుక ఏదైనా సరే.. మద్యం, ముక్క ఉండాల్సిందే. ఎంత చిన్న ఫంక్షన్‌ అయినా సరే మందు, మాంసం తప్పనిసరి. లేకపోతే అసలు ఫంక్షన్స్‌కు రారు జనాలు. ఆఖరికి చావు అయినా సరే.. మద్యం, మాంసం ఉండాల్సిందే. ఇక పెళ్లి వంటి శుభకార్యాల్లో అయితే మద్యం ఏరులై పారుతుంది. ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి శుభకార్యాలు జరిగడం లేదు. ఇక ఆషాఢ బోనాలతో మళ్లీ ఫంక్షన్‌లు, దావత్‌లు మొదలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. దావత్‌లు, ఫంక్షన్‌లు చేసే వారిపై నిఘా పెడుతున్నారు. ఆ వివరాలు..

రాష్ట్రంలో జరుగుతున్న దావత్‌లు, పార్టీలు, ఫంక్షన్‌లపై తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఫంక్షన్లు, పార్టీల్లో మద్యం వినియోగంపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనుంది. దీనిలో భాగంగా ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించని మద్యం(నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌-ఎన్‌డీపీఎల్‌) వినియోగంపై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఫంక్షన్లలో ఎన్‌డీపీఎల్‌ వినియోగంపై దాడులు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు అధికారులు. నిబంధనల ప్రకారం ఫంక్షన్లు, విందు పార్టీల్లో మద్యం వినియోగానికి ముందుగా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి ‘ఈవెంట్‌ పర్మిషన్‌’ తీసుకోవాలి. అలా పర్మిషన్ తీసుకున్న వారికి మాత్రమే మద్యం అనుమతి ఉంటుంది. అనుమతి తీసుకున్నప్పటికి కూడా.. రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్‌ను మాత్రమే ఫంక్షన్‌లలో వాడాలి.

కానీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి తీసుకున్న వారిలో కొందరు తక్కువ ధరకు మద్యం వస్తుందని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. దాన్నే వాడుతున్నారు. ఇందుకోసం కేంద్ర పాలిత ప్రాంతాలనైన యానాం, గోవా వంటి ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా మద్యాన్ని తీసుకొచ్చి దావత్‌లలో వినియోగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయనికి భారీగా గండి పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తమైంది. ఆ శాఖ కమిషనర్‌ శ్రీధర్, ఎక్సైజ్‌ ఈడీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

అలానే పార్టీలు, దావత్‌లు, ఈవెంట్ల నిర్వహణకు అనుమతులు తీసుకోకపోవడం, ట్యాక్స్‌లు చెల్లించని ఎన్‌డీపీఎల్‌ మద్యం వినియోగించడంపై అధికారులు నిఘా పెట్టనున్నారు. ఇక ఇప్పటికే ఈ ఏడాదిలో 302 కేసులు నమోదు చేశారు. మెుత్తంగా 165 మందిని నిందితులుగా చేర్చి 35 వాహనాలను సీజ్ చేశారు. రూ.61.13 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇకపైనా నిఘా కొనసాగుతుందని.. మద్యం వినియోగించేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి